22 మంది మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక

తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 22 మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. వేటగాళ్లని ఆరోపిస్తూ శనివారం వీరిని అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రెండు పడవలను కూడా విడుదల చేశామని కంట్రీబోట్‌ జాలర్ల సంఘం అధ్యక్షుడు రాయప్పన్‌ రామేశ్వరంలో విలేకరులతో తెలిపారు.

 పిఎం స్వనిధి కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మలా  సీతారామన్  శనివారం రామేశ్వరం చేరుకున్నారు. దీంతో  మత్స్యకారులను, వారి పడవలను విడిపించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ తాము శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశామని చెప్పారు.   

ఆమె ఢిల్లీలోని విదేశీవ్యవహారాల కార్యదర్శితో పాటు శ్రీలంకలోని భారత హై కమిషనర్‌తో కూడా మాట్లాడారని పేర్కొన్నారు.  అరెస్ట్‌ చేసిన మత్స్యకారులను శ్రీలంక అధికారులు ఐఎంబిఎల్‌ వద్ద అప్పగించారని, వారు స్వదేశానికి తిరిగి వస్తున్నారని తెలిపారు.

అయితే 2018 నుండి శ్రీలంక అదుపులో ఉన్న మరో మత్స్యకారుడు నంబు మురుగన్‌ను విడుదల చేయాలని మరో మత్స్యకారుడు పి. జెసు రాజా ఆర్థికమంత్రిని కోరారు. అతనితో పాటు 118 బోట్‌లను కూడా స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు.