కుల్గాంలో ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ముష్కరులను హతమార్చినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఆపరేషన్ తుది దశకు చేరుకుందని, హతమైన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ చేపట్టామని తెలిపారు.
 
సరిహద్దు భద్రతా దళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజులుగా జమ్మూ కశ్మీర్ లో భారత్, పాక్ సరిహద్దు వెంబడి సైనికులు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సర్చ్ చేస్తుండగా కుల్గాం జిల్లాలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారత సైన్యం ఉగ్రవాదులను  అంతమొందించింది. 
 
“ఐదుగురు ఉగ్రవాదులను కుల్గామ్ పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ మట్టుబెట్టాయి. వారి నుంచి విధ్వంసకర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ చివరి దశలో ఉంది” అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
 
కుల్గాం జిల్లా దంహాల్‌ హంజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గురువారం సాయంత్రం 4 గంటలకు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. అదికాస్తా ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య శుక్రవారం ఉదయం కాల్పులు ప్రాంభమయ్యాయి.
 
ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్, 9 పారా (ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్ యూనిట్) పోలీస్, సీఆర్పీఎఫ్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. రాత్రిపూట ఆ గ్రామాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ ప్రదేశంలో లైట్లను ఏర్పాటుచేశారు. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం చుట్టూ భద్రతా బలగాలు గట్టి వలయాన్ని నిర్వహించి, రాత్రిపూట ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
 
కుల్గామ్‌లోని నేహమా ప్రాంతంలోని సామ్నో వద్ద రాత్రిపూట ప్రశాంతంగా ఉన్న తర్వాత శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.  ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. 
 
ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో మంటలు చెలరేగడంతో వారు బయటకు వచ్చేశారు. సెప్టెంబరు 13న అనంత్‌నాగ్‌ గారోల్ అడవుల్లో వారం రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో నలుగురు భద్రతా సిబ్బంది, ఇద్దరు టెర్రరిస్టులు హతమైన తర్వాత దక్షిణ కశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇది. 
 
నవంబరు 15న ఉరి సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటును సైన్యం తిప్పికొట్టి.. ఇద్దర్ని హతమార్చిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కాళీ పేరుతో సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది.