5 నెలల కనిష్టానికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చింది. ఇప్పుడు 5 నెలల కనిష్టానికి పడిపోయింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడంతోనే వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్) తగ్గింది. దీంతో ఈ అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 4.87 శాతంగా నమోదైందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

జూన్ నెలలో చివరిసారిగా రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా నమోదైంది. ఇక సెప్టెంబర్‌లో మాత్రం 5.02 శాతంగా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగానే ఉంది. 4.8 శాతంగా ఉంటుందని అంచనా వేయగా అంతకంటే తక్కువే వచ్చింది.

ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నప్పటికీ  ద్రవ్యోల్బణం తగ్గుతుండటం విశేషం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా నమోదైంది. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్షిత పరిధి అయిన 6 శాతం కంటే ఎక్కువే కావడం గమనార్హం. అంతకంటే తక్కువ ద్రవ్యోల్బణం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర బ్యాంకు.

ఇక ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 లో రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం 5.4 శాతంగా నమోదు కావొచ్చని ఆర్‌బీఐ అక్టోబర్ నెల ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమయంలో అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2 నుంచి 6 శాతం మధ్య ఉంచాలని  కేంద్రం రిజర్వ్ బ్యాంకుకు బాధ్యత అప్పగించింది. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఆర్‌బీఐ వరుసగా రెపో రేటు పెంచుకుంటూ పోయింది.
కిందటేడాది మార్చి సమయంలో 4 శాతంగా ఉన్న రెపో రేటు ఇప్పుడు 6.50 శాతానికి చేరింది. అంటే దాదాపు 250 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం పెంచేసింది. దీంతో ద్రవ్యోల్బణం దాదాపుగా దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తన వంతుగా చర్యలు చేపడుతూ వస్తోంది. దీంట్లో భాగంగానే ఆయా నిత్యావసరాల రేట్లను తగ్గిస్తూ వస్తోంది.
ఉల్లిగడ్డ బఫర్ స్టాక్స్ తీసుకొస్తుండటం సహా కొద్దిరోజుల కిందట రాఖీ పండగ గిఫ్ట్‌గా గ్యాస్ సిలిండర్ రేట్లను ఒక్కసారిగా రూ. 200 తగ్గించింది. ఉజ్వల యోజన కింద సబ్సిడీని కూడా రూ. 200 నుంచి రూ. 300 కు పెంచింది. దీంతో ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు దోహదం చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గితే ఆహార పదార్థాల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండదు. దీంతో సామాన్య ప్రజలపై భారం తగ్గుతుంది. అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి.