2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ ఇండో-ఫసిపిక్ ప్రాంతీయ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ “ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు (జిడిపి) కేవలం 7 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్ ఈ మేర వృద్ధి సాధించడం గొప్ప విషయం. ఆర్థిక వ్యవస్థ ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనిస్తోంది” అని తెలిపారు. 
 
మరో నాలుగేళ్లలో జపాన్, జర్మనీ ఆర్థిక వ్యవస్థలను దాటుకుని దూసుకుపోతుందని ఆశిస్తున్నామని ఆమె భరోసా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ – రష్యా, ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం జరుగుతున్నా  ఆ ప్రభావాన్ని అధిగమించి వృద్ధి రేటు సాధిస్తున్నామని ఆమె తెలిపారు. “9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు సముద్రతీరాన్ని కలిగి ఉన్నాయి. 12 మేజర్, 200లకు పైగా నాన్-మేజర్ ఓడరేవులు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ వాణిజ్యం కోసం విస్తృతమైన సముద్ర నెట్ వర్క్ కలిగి ఉన్నాం” అని ఆమె వివరించారు. 

2020లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో సముద్ర ఆధారిత వస్తువులను ఎగుమతి చేసే 2వ అతిపెద్ద దేశంగా భారత్ ఉందని ఆమె గుర్తు చేశారు. పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెబుతూ నేడు భారతీయులు స్వదేశంలో, విదేశాల్లో తలెత్తుకుని నిలబడుతూ భారత్ విజయాలను సగర్వంగా చాటి చెబుతున్నారని ఆమె పెర్కోన్నారు.

బ్రౌన్ ఎకానామీ నుంచి బ్లూ ఎకానమీగా మార్చడంపై దృష్టి సారించామని చెబుతూ అనేక గణాంకాలు సూచించే విధంగా వ్యాపారానికి అనుకూలమైన వాతావరణంతో సుపరిపాలన, వినూత్న దేశంగా భారత్ తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోందని సీతారామన్ తెలిపారు. ఇండో-పసిఫిక్ తీరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని చెబుతూఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.

అంతర్జాతీయ ఎగుమతుల పరంగా, భారత్ ర్యాంకు 2014లో 44వ స్థానంలో ఉండగా 2023 నాటికి ఆ ర్యాంకు 22కు చేరుకుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. 2022లో ప్రారంభించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద మానిటైజేషన్ కోసం 9 మేజర్ పోర్ట్‌లలో 31 ప్రాజెక్టులను గుర్తించామని ఆమె చెప్పారు. 
 
భారత్- మిడిల్ ఈస్ట్- యూరోప్ కనెక్టివిటీ కారిడార్ (ఇమేక్) అత్యంత ఆశాజనకమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లలో ఒకటని పేర్కొంటూ ఈ కారిడార్ ద్వారా రవాణా సామర్థ్యాన్ని పెంచడం, లాజిస్టిక్ ఖర్చులను తగ్గించుకోవచ్చని సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఆమె తెలిపారు. 
 
దక్షిణాసియా, పశ్చిమాసియా, యూరప్‌ల ఆర్థిక ఏకీకరణకు దారితీసే ఈ కారిడర్ భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, పైగా,  ఆయా ప్రదేశాల మధ్య కనెక్టివిటీని పెంచుతుందని ఆమె వివరించారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం కారణంగా ఈ ప్రాజెక్ట్ కు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.