నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది దుర్మరణం

నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది దుర్మరణం

* నాంపల్లిలో ఏడుగురు సజీవ దహనం

దీపావళి పర్వదినం సదంర్భంగా హైదరాబాద్‌లోని పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. టపాసులు పేల్చటంతో పలు ప్రాంతాల్లో ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మల్కాజ్‌గిరిలో భార్యను కాపాడబోయి ఓ వృద్ధుడు మృతి  చెందగా, నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ కెమికల్ గోదాంలో ఈ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మందికార్మికులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. 
నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. నాలుగు అంతస్థుల వరకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మరికొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికులను రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
గోడౌన్ ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్ లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. గోడౌన్ లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడినట్లు తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శాలిబండలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. 
రెండు అంతస్తుల్లో ఉన్న భవనంలో పూర్తిగా మంటలకు ఆహుతైంది. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
మల్కాజ్‌గిరిలో టపాసులు కాలుస్తుండగ దంపతులు మంటల్లో చిక్కుకున్నారు.  ప్రేమ్ విజయనగర్ కాలనీ వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రాఘవరావు (82) అతని సతీమణి రాఘవమ్మ (79) దీపాలు వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు భార్య చీరకు నిప్పంటుకుంది. ప్రమాదం నుంచి భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త మంటల్లో చిక్కుకుపోయి మృతి చెందారు. భార్యకు 80 శాతం గాయాలు కావడంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇక హైదరాబాద్ శివారు నార్సింగిలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ గ్రామంలోని ఓ టెంట్ హౌజ్‌లో మంటలు అంటుకున్నాయి. ప్లాస్టిక్ సామాగ్రి, టెంట్లు ఉండడంతో క్షణాల మీద మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న కూల్ డ్రింక్ గోదాంకు కూడా మంటలు అంటుకున్నాయి.  మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో పక్కనే ఉన్న మూడు అంతస్తుల భవనం నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
భారీగా పొగ వ్యాపించటంతో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు.  టపాసులు కాల్చే క్రమంలో రాకెట్ టెంట్ హౌజ్‌లోకి దూసుకెళ్లటంతో ఈ ప్రమదం జరిగింది. 
టెంట్ హౌజ్‌లో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకొని దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రూ. 50 లక్షల అస్థి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.
 
సోమవారం తెల్లవారుజామున అమీర్‌పేట్‌ పరిధిలోని మధురానగర్‌లో ఓ ఫర్నీచర్‌ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదాంలోని లక్షల విలువైన ఫర్నీచర్‌  దగ్ధమైంది.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది.కార్యాలయంలోని రికార్డ్ రూంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీపావళి సందర్భంగా కార్యాలయం ఎదుట టపాసులను కాల్చడంతో నిప్పు రవ్వలు కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.
 
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాశ మైలారం లోని పారిశ్రామిక వాడలో ఓ రసాయన పరిశ్రమలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రంగా గాయలు అయ్యాయని తెలుస్తుంది.గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.