హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవిపై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు 

హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవిపై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు 

బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్‌మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కొడుకును కాపాడుకునేందుకు ఆమెను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది. ఆ వార్తలు పూర్తిగా కల్పితమని.. అసత్య ప్రచారమని మండిపడింది. 

దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్ II) బి.ఎస్. చిరంజీవి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్టు ఇస్తారని సోషల్‌మీడియాతో పాటు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందని ఫిర్యాదు లేఖలో ఆయన పేర్కొన్నారు. దీనివల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ మేరకు పలు సోషల్‌మీడియా పోస్టులను ఆధారంగా చూపిస్తూ ఆయన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఐటీ యాక్ట్, బీఎన్‌ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.   బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా ఈ దుష్ప్రచారంపై జస్టిస్ మాధవీదేవి విచారం వ్యక్తం చేశారు. 
 
కేసు విచారణను తాను కొనసాగించడంపై ఎవరికైనా చిన్నపాటి అభ్యంతరం ఉన్నా వెంటనే చెప్పాలని, విచారణ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. దానితో బాధితురాలి తరఫు సీనియర్‌ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు, పిటిషనర్‌ తర ఫు న్యాయవాది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కూ డా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. 
 
‘మీలో ఎంతమంది సోషల్‌ మీడియాలో ఉన్నారు? అకడ జరుగుతున్న స్మియర్‌ క్యాంపెయిన్‌ (దుష్ప్రచారాన్ని) గమనించారా?అని జస్టిస్‌ మాధవీదేవి ప్రశ్నించారు. తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఉద్దేశాలను ఆపాదిస్తూ ప్రచారం జరగడం బాధాకరమని ఆమె వాపోయారు. ‘కొందరు నన్ను ప్రభావితం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ఆశ చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.