నగరంలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి మేఘ మథనం ద్వారా ‘కృత్రిమ వర్షం’ కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఐఐటీ కాన్పూర్ నిపుణులను సంప్రదించింది. ఈ సమయంలోనే హఠాత్తుగా వర్షం కురవడం పెద్ద ఊరట. మరోవైపు, కాలుష్య నిరోధక చర్యలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రులను కూడా రంగంలోకి దించింది.
తనిఖీ ప్రక్రియలో భాగంగా పలువురు ఢిల్లీ మంత్రులు గురువారం పొరుగు రాష్ట్రాలకు అనుసంధానించే వివిధ ప్రాంతాలు, సరిహద్దులను పరిశీలించారు. ప్రస్తుతం, నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఢిల్లీలో అమలవుతోంది. నగరంలో గాలి నాణ్యత అత్యంత తీవ్రమైన కేటగిరీకి పడిపోయింది. వాయు కాలుష్య సూచీ (ఏక్యూఐ) వరుసగా ఏడో రోజు 400 దాటింది. అయితే, ఈ పరిస్థితి దీపావళి ముందు మెరుగుపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం తెలిపింది. ఐఎండీ చెప్పినట్టుగానే ఢిల్లీలో వర్షం కురిసి కాలుష్యం నుంచి కాస్త ఉపశమనం లభించింది.
పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధం, వాహన ఉద్గారాలు వంటి స్థానిక అంశాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచి తీవ్ర కేటగిరీలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ మంత్రులు సమావేశమయ్యారు. కాలుష్య తీవ్రతను తగ్గించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. వివరణాత్మక ప్రణాళిక సమర్పించాలని ఐఐటీ బృందాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది.
కాగా, పాకిస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు దట్టంగా పొగమంచు కమ్ముకున్నట్లు నాసా గురువారం విడుదల చేసిన ఫోటోలు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ, ఎన్సీఆర్లో మాత్రమే ఎక్కువగా పొగమంచు ఉందని వివరించింది. ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ మరింత తీవ్రంగా ఉందని పేర్కొంది.
More Stories
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభం
రాజ్యాంగబద్ధ పాలనకై పోరాడిన పార్టీపైనా దుష్ప్రచారం!?
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్కు ఓటమి ఖాయం