పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట

ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉదయం ‘మంగళ ఆలటి’ నిర్వహించిన తరువాత భక్తులను లోపలకు అనుమతించడంతో ఆలయం మెట్లపై ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
 
ఒడిశాలో గత పౌర్ణమి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని నేడు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో ఉదయం ఆలయంలో ‘మంగళ ఆలతి’ నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలోకి నెట్టుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
 
విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం, ఆలయంలోని ఘంటిద్వార, సతపహచ సమీపంలో తొక్కసలాట జరిగింది. ఆలయం బయట వేచిచూస్తున్న భక్తులు ఒక్కసారిగా లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించినట్టు గాయపడిన మహిళ ఒకరు తెలిపారు. ఈ తోపులాటలో తాను కిందపడిపోయాయని, జనం తన మీద నుంచి వెళ్లారని చెప్పారు. 
 
పోలీసులు వెంటనే తనను పైకి లేపి ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. శ్రీమందిర్ వెలుపల, సతపహచ ముందు బారికేట్లు ఏర్పాటు చేశారు. అయితే నాట్యమండపం, జే-బిజయ్ ద్వారా వద్ద ఎలాంటి బారికేడ్లు లేవు. సింహద్వారం దాటి సతపహచ చేరి నాట్యమండంపం దగ్గరకు వచ్చేసరికి రద్దీ పెరిగిపోయినట్టు స్థానిక భక్తులు ఒకరు తెలిపారు. 
 
స్టీల్ బారికేడ్లు, తాళ్లతో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉంటే భక్తులకు ఎట్నించి ఎటు వెళ్లాలో తెలిసేదని ఆయన అన్నారు. కార్తీక మాసంలోని పవిత్ర శుక్రవారం కావడంతో జనులు పెద్దఎత్తున స్వామివారి దర్శనానికి వచ్చారు.