కేరళలో ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్

కేరళలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాలపూజ పోలీసు స్టేషన్ పరిధిలోని పెరియా ప్రాంతంలో కేరళ పోలీసు ప్రత్యేక బృందాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఫోన్ చార్జింగ్ కోసం ఇంట్లోకి వచ్చిన మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. విశ్వసనీయ సమాచారం మేరకు పలువురు మావోయిస్టులు అటవీ ప్రాంతంనుంచి ఫోన్ చార్జింగ్ కోసం ఓ ఇంట్లోకి వచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ఈ క్రమంలో పోలీసులకు, మావోయిసులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.  ముగ్గురు మావోయిస్టులు తప్పించుకుని పారిపోగా మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వీరిని దగ్గర్లోని పోలీసుక్యాంప్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిని తమిళనాడుకు చెందిన చంద్రు, కర్ణాటకకు చెందిన ఉన్నిమాయగా గుర్తించారు.

కేరళలోని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న మావోయిస్టు బాణాసుర దళం కార్యదర్శి అయినా చుండ్రు పట్టుబట్టడం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ లలో కీలక విజయంగా పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. తప్పించుకు పారిపోయిన మరో ఇద్దరు మహిళా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

తప్పించుకు పారిపోయిన మావోయిస్టులను సుందరి, లతగా గుర్తించినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ అజిత్ కుమార్ మీడియాకు తెలిపారు. వారిద్దరితో పాటు మరో పురుషుడైన మావోయిస్టు కూడా తప్పించుకున్నవారిలో ఉన్నట్లు చెబుతున్నారు. మావోయిస్టుల నుండి ఏకే 47 రైఫిల్ , ఇన్సాఫ్ రైఫిల్, రెండు నాటు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల కోజికోడ్‌లో అరెస్టు చేసిన మావోయిస్టు సానుభూతిపరుడు ఇచ్చిన సమాచారం మేరకు కేరళ పోలీసులు ఈ ప్రాంతంలోసెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆపరేషన్ గ్రూపు (ఎస్‌ఓజి), రాష్ట్ర పోలీసుకు చెందినథండర్ బోల్ట్ స్కాడ్, ప్రత్యేక కమాండో బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.