మాజీ ఎంపీ పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు

మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో హైదరాబాద్, ఖమ్మంలో ఐటి అధికారులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్ లోని నందగిరిహిల్స్ నివాసంతోపాటు ఖమ్మంలోని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. 
 
గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు పొంగులేటి నివాసంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతోపాటు సిబ్బంది ముబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాలు చేస్తున్నారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  
 
గురువారం ఆయన నామినేషన్ వేయనున్న క్రమంలో ఐటీ దాడులు జరుగుతుండడం గమనార్హం.  అయితే ఇది ఊహించిన పరిణామమే అని పొంగులేటి అనుచరులు అంటున్నారు. తనపై ఐటి దాడులు ఉండొచ్చునని మూడు రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
 
ఇలా ఉండగా, బుధవారం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. నివాసంలో డబ్బులు ఉన్నాయని, సీ విజిల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి శ్రీలత, సిఐ రాజిరెడ్డి వారి సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. 
 
అనంతరం అధికారులు విలేకరులతో మాట్లాడుతూ  యాప్‌లో అందిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించగా ఎటువంటి నగదు లభ్యం కాలేదని తెలిపారు. ఈ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.
 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 వేల బోగస్ ఓట్లను చేర్పించారని మంత్రి పువ్వాడ అజయ్‌పై తుమ్మల ఆరోపించారు. ఆ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన ఇంటిపై సోదాలు జరిగాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కే లక్ష్మారెడ్డి,  పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లల్లో ఐటి అధికారులు సోదాలు జరిపారు.