మిజోరంలో 77.04, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం పోలింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరం, ఛత్తీస్‌గఢ్ తొలి విడత పోలింగ్ ముగిసింది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకూ 77.04 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌ లో తొలి విడతగా 20 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, 70.87 శాతం పోలింగ్ నమోదైంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న బస్తర్ జిల్లాతో సహా మొత్తం 20 నియోజవర్గాల్లో పోలింగ్ కోసం భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించినప్పటికీ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితిలు తలెత్తాయి. సుక్మా జిల్లాల్లో నక్సల్ జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 

ఖైరగఢ్-చుయుఖదాస్-చౌకిలో అత్యధికంగా 76 శాతం పోలింగ్ నమోదు కాగా, బిజాపూర్‌లో అత్యల్పంగా 40.98 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉత్తర్ బస్తర్ కాంకెర్‌లో 75.71, కొండగావ్‌లో 75.35, రాజ్‌నంద్‌గావ్‌లో 75.1 శాతం, బస్తర్ (జలంధర్)లో 72.41 శాతం పోలింగ్ నమోదైంది.

 మొహ్ల-మాన్‌పూర్, అంతగఢ్, భానుప్రతాప్‌పూర్, కాంకెర్, కేష్కల్, కొండగావ్, నారాయణపూర్, దంతేవాడ, బిజాపూర్, కోంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. తక్కిన అసెంబ్లీ నియోజకవర్గాలో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 223 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో తక్కిన 70 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరుగనుంది

మిజోరంలోని పలు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. సేర్‌ఛిప్ నియోజకవర్గంలో అత్యధికంగా 83.96 శాతం పోలింగ్ నమోదు కాగా, మమిట్‌లో 83.42 శాతం పోలింగ్ నమోదైంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) చీఫ్, ముఖ్యమంత్రి జోరంథాంగ ఐజ్వాల్ ఈస్ట్-1 నుంచి తిరిగి పోటీలో ఉండగా, జోరం పీపుల్స్ మూమెంట్ (జడ్‌పీఎం) చీఫ్ లాల్డుహోమ సేర్‌ఛిప్ నుంచి పోటీ చేస్తూ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ను గద్దె దింపింది. ఈసారి ఎంఎన్ఎఫ్. జడ్‌పీఎం, కాంగ్రెస్ మొత్తం 40 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలపగా, బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మిజోరంతో పాటు మంగళవారం జరిగిన ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి.