చంద్రబాబు బెయిల్ ఆంక్షలు ఉల్లంఘించలేదు

మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉల్లంఘించారని అనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని తేల్చిచెప్పింది.  మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వులు సందర్భంగా కోర్టు నిర్దేశించిన షరతులకు చంద్రబాబుకు కట్టుబడి ఉంటున్నారా? అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను నియమించాలన్న సీఐడీ అభ్యర్ధనను తోసిపుచ్చింది. 

అయితే అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లోని అభ్యర్థనలను పాక్షికంగా అనుమతించింది. బహిరంగ సభలలో పాల్గొనకూడదని చంద్రబాబుకు స్పష్టం చేసింది. ర్యాలీలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడం గానీ చేయొద్దని ఆదేశించింది.  స్కిల్‌ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేస్తూ సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. 

చంద్రబాబు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను కస్టోడియల్‌ బెయిల్‌తో సమానంగా చూడలేమని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు. సీఐడీ కోరిన విధంగా చంద్రబాబు కార్యకలాపాలు పరిశీలించేందుకు ఆయన ఇంటి వద్ద ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను నియమించడం గోప్యత హక్కును హరించడమేనని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది చేసిన వాదనలో బలం ఉందని చెప్పారు.

చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకు ఏమి సంబంధం అనే విషయంపై సీఐడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయ కార్యకలాపాలపై షరతులు విధించడం దర్యాప్తు ప్రక్రియకు ఏవిధంగా దోహదపడుతుందో సీఐడీ వివరణ ఇవ్వాలి. కోర్టు విధించే అదనపు షరతులు దర్యాప్తునకు ప్రయోజనం చేకూర్చేవిగా ఉండాలన్న చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలో బలం ఉందని న్యాయమూర్తి తెలిపారు. 

`చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మధ్యంతర బెయిల్‌పై ఉండగా.. ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు, ప్రకటనలు చేయకుండా నిరోధించడం వాక్‌స్వాతంత్య్ర హక్కుపై ప్రభావం చూపుతుంది. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ ఇచ్చామని.. చంద్రబాబు సాధారణ కార్యకలాపాలు నిర్వహించకూడదని, అభిప్రాయాలు వ్యక్తపరచరాదని చెప్పడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు.

మధ్యంతర బె యిల్‌ ఉత్తర్వులు ఇచ్చే సందర్భంలో కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి చంద్రబాబు ర్యాలీ నిర్వహించి రాజకీయ ప్రసంగం చేశారని ఏఏజీ పేర్కొన్నారని.. జైలు నుంచి విడుదలయ్యాక ఆయన చేసిన ప్రసంగం, నిమగ్నమైన కార్యక్రమాల వివరాలను పెన్‌డ్రైవ్‌లో కోర్టు ముందు ఉంచారని.. వాటిని పరిశీలిస్తే చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్‌, పొలిటికల్‌ ర్యాలీ నిర్వహించినట్లు కనపడడం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

‘తనను పలకరించడానికి వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబు ప్రతిస్పందించడం చాలా సహజం. ఆయన్ను చూసేందుకు వెళ్లొద్దని ప్రజలకు ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయజాలదు. చంద్రబాబును చూడడానికి ప్రజలు రావడాన్ని దర్యాప్తునకు అవరోధంగా చూడలేం’ అని తెలిపింది. 

గుంపులుగా వచ్చే ప్రజలను నియంత్రించే సామర్థ్యం రాష్ట్రప్రభుత్వానికి ఉంటుంది. అంతేతప్ప చంద్రబాబు ప్రజా సమూహాన్ని నియంత్రిస్తారని ప్రభుత్వం ఆశించకూడదు. కోర్టు ముందు ఉంచిన వివరాలను పరిశీలిస్తే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని న్యాయమూర్తి తెలిపారు.