ఇష్టానుసారం నిర్మాణాలను తొలగిస్తున్న టిటిడి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇష్టానుసారం నిర్మాణాలను తొలగిస్తున్నారని ఏపీ బిజెపి అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి డి. పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలోని పార్వేటి మంటపాన్ని తొలగించి యథావిధిగా నిర్మిస్తామని చెప్పారని, ఆ తర్వాత ఇష్టానుసారంగా చేశారని ఆమె విమర్శించారు. 
 
ఇప్పుడు అలిపిరి మంటపాన్ని తొలగిస్తామని చెపుతున్నారని అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంటపాలను తొలగించాలంటే కేంద్ర పురావస్తు శాఖ అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు.
 
రాష్ట్రవ్యాప్త పర్యటనకు బుధవారం అలిపిరి నుండి శ్రీకారం చుట్టిన ఆమె అలిపిరి మంటపాన్ని 500 సంవత్సరాల కంటే ముందే నిర్మించారని గుర్హ్టు చేశారు. దాన్ని ఏమి చేయాలన్నా పురావస్తు శాఖ అనుమతి తీసుకోవాలని ఆమె తేల్చి చెప్పారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే బిజెపి చూస్తూ ఊరుకోదని, ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు.

అలిపిరిలోని మండపాన్ని ఏమి చేయాలన్నాటీటీడీ తప్పకుండా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోనే చేయాలని, లేదంటే బీజేపీ తప్పకుండా ప్రతిఘటిస్తుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. మండపాల మరమ్మతులు, తొలగింపు వంటి పనులు ఖచ్చితంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ‌్వర్యంలోనే జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

టీటీడీ నిధులను తిరుపతి మున్సిపాలిటీకి కేటాయించే విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గిందని, మరో మార్గంలో టీటీడీ నిధులను పొందేందుకు ప్రయత్నాలు జరుగుతోందని చెబుతూ అదే జరిగితే బీజేపీ ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు. చెత్త పన్ను, కరెంటు చార్జీల మోత … ఇలా ఎన్నో రకాలుగా వసూలు చేస్తున్నారని చెబుతూ, వాటి ఆదాయంతోనే ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆమె హితవు చెప్పారు. 

టీటీడీ నిధులతో సనాతన ధర్మ అభ్యున్నతికే ఖర్చు చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇమామ్‌లకు, ఫాస్టర్లకు గౌరవవేతనం ఇస్తోందని, కానీ ఎస్సీ, ఎస్టీ అర్చకులు ఉన్న ఆలయాల ధూప దీప నైవేద్యాలకు ఇస్తున్న సంభావనలను మాత్రం నిలిపివేసిందని ఆమె ఆరోపించారు. దళిత అర్చకులకు నిలిపివేసిన సంభావనను వెంటనే కొనసాగించాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.