చంద్రబాబుకు హైకోర్టులో మధ్యంతర బెయిల్ 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుడి కంటికి క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. 
ప్రభుత్వ వైద్యుడి సిఫార్సుల ఆధారంగా చంద్రబాబుకు నవంబర్ 28వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు.  మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నవంబర్ 10వ తేదీకి విచారణ వాయిదా పడింది.

చంద్రబాబు ఆరోగ్యపరమైన సమస్యల ఉన్నాయని, కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు.  చంద్రబాబుకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, కంటి ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదని, బెయిల్ ఇవ్వొద్దని సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తీర్పునున వెల్లడించారు.

ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో మాత్రమే సుప్రీం కోర్టు స్టే ఉందని, 24వ తేదీ వరకు ఆరోగ్య కారణాలతో స్కిల్‌ స్కామ్‌ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు లక్ష రుపాయల ష్యూరిటీ, ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబు ఆస్పత్రికి, ఇంటికి మాత్రమే పరిమితం కావాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు నిబంధనలు విధించింది. చంద్రబాబు తాను కోరుకున్న చోట వైద్య పరీక్షలతో పాటు శస్త్రచికిత్స పొందవచ్చని తెలిపింది. 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు లొంగిపోవాలని సూచించింది. రాజకీయ సమావేశాలలో పాల్గొనరాదని స్పష్టం చేసింది.  చంద్రబాబు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కొనసాగించాలనే విజ్ఞప్తి నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుతో సిఐడి అధికారులను ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీనిపై ప్రత్యేకంగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు  బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు.