30 సాయంత్రం వరకూ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల  ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్‌ 7 నుంచి నవంబర్‌ 30 వరకు పలు దఫాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. 
 
నవంబర్‌ 7 ఉదయం 7 గంటల నుంచి నవంబర్‌ 30 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలను వెల్లడించడం వంటివి చేయరాదని ఈసీ పునరుద్ఘాటించింది. ఒకవేళ, ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. 
 
కాగా, ఒక్క ఛత్తీస్‌గఢ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7న తొలిదశ, నవంబర్‌ 17న రెండో దశ పోలింగ్‌ జరుగుతుంది.  మిజోరంలో నవంబర్‌ 7, మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17, రాజస్థాన్‌లో నవంబర్‌ 25, తెలంగాణలో నవంబర్‌ 30న పోలింగ్‌ ముగియనుంది. అదే రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. 
 
ఇక, ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు 3న ఓట్లను లెక్కించి, ఫలితాలను వెలువరిస్తారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉండగా.. తెలంగాణలో మాత్రం త్రిముఖ పోరు నెలకుంది. ఇక్కడ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి.