చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-3 ఆర్బిటర్

చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో ప్రొపల్షన్, ల్యాండింగ్ మాడ్యుల్ రెండు ఉన్నాయి. చంద్రుడి కక్ష్యలోకి వ్యోమనౌక చేరిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయింది.
 
అనంతరం ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ దిగింది. రెండు వారాల పరిశోధనల అనంతరం ఈ రెండింటిని ఇస్రో నిద్రాణ స్థితిలోకి పంపింది. వీటిని తిరిగి మేల్కొలిపే ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. అయితే, ప్రొపల్షన్ మాడ్యుల్ మాత్రం చంద్రుడి కక్ష్య చుట్టూ ప్రస్తుతం తిరుగుతూనే ఉంది.  న్యూక్లియర్ టెక్నాలజీ ద్వారా ఈ మాడ్యుల్ అవసరమైన శక్తిని పొందుతుంది.
ఈ నేపథ్యంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ అజిత్ కుమార్ మెహంతి మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన అంతరిక్ష మిషన్‌లో భారత అణుశక్తి విభాగం భాగం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) రూపొందించి, అభివృద్ధి చేసిన రెండు రేడియో ఐసోటోప్ హీటింగ్ యూనిట్లు (ఆర్ హెచ్ యు)లను ప్రొపల్షన్ మాడ్యూల్‌లో అమర్చామని, ఇది ఒక వాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని ఇస్రో అధికారులు తెలిపారు.
ఈ యూనిట్లు వ్యోమనౌకకు అవసరమైన ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచుతాయి.  భవిష్యత్ రోవర్లలో సాధనాలను నిర్వహించడానికి ఇస్రో త్వరలో అణు వనరులను ఉపయోగించుకోవచ్చని చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్ పేర్కొన్నారు. చంద్రయాన్- 3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో ఆర్‌హెచ్‌యులకు అమర్చడం సాధ్యం కాదని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 
 
ప్రయోగాత్మక, ప్రదర్శన ప్రయోజనాల కోసం వాటిని ప్రొపల్షన్ మాడ్యూల్‌లో ఉంచారు. ‘ఎటువంటి ఆటంకం లేకుండా అవి సక్రమంగా పనిచేస్తున్నాయి.. ఇంది ఇస్రో, బార్క్ మొట్టమొదటి అతిపెద్ద ఉమ్మడి ప్రాజెక్ట్’ అని ఓ అధికారి చెప్పారు.  కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. బృహస్పతిపై పరిశోధనలకు పంపిన గెలిలీయో, శనిగ్రహం పరిశోధనలకు చేపట్టిన కేసిని, వయోజర్ 1, వయోజర్ 3 సహా పలు వ్యోమనౌకల్లో రేడియో-ఐసోటోప్ హీటర్ యూనిట్లను ఉపయోగించారు.

కాగా, చంద్రయాన్‌-3 ప్రయోగం సందర్భంగా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను 1,696.4 కిలోల ఇంధనంతో నింపారు. ఇది భూ కక్ష్యలోకి చేరిన తర్వాత క్రమంగా కక్ష్యను పెంచేందుకు ఇస్రో పలు విన్యాసాలు చేపట్టింది. ఐదు దశల్లో వ్యోమనౌక భూ కక్ష్య దాటి.. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.