అయోధ్య రాముడికి 8 అడుగుల ఎత్తైన సువర్ణ తాపడ సింహాసనం

అయోధ్యలోని భవ్యమైన రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శిల్పకారులు ఆలయానికి తుది మెరుగులు దిద్దుతూ నిర్విరామంగా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల ప్రతిష్ఠకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ ట్రస్ట్‌ ఏర్పాట్లును చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రామాలయానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా బుధవారం వెల్లడించారు. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారుపూత పూసిన 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.  ప్రస్తుతం ఈ సింహాసనానికి రాజస్థాన్‌లో శిల్పకారులు తుది మెరుగులు దిద్దుతున్నారని, డిసెంబరు 15 నాటికి ఇది అయోధ్యకు చేరుకుంటుందని అనిల్ మిశ్రా పేర్కొన్నారు. 
 
మందిరంలో మొదటి అంతస్తును డిసెంబరు 15 నాటికి సిద్ధమవుతుందని, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పనులు వేగంగా పూర్తిచేయడానికి శిల్పులు, నిర్మాణ కార్మికులను పెంచామని తెలిపారు. మొదటి అంతస్తులో 17 స్తంభాలను ఏర్పాటు చేశామని, మరో రెండింటిని త్వరలో ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. పరికర్మ మార్గ్‌ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం గృహ మండపం పనులు జరుగుతున్నాయని అనిల్ మిశ్రా తెలిపారు. 
 
ఈ నెలాఖరుకి రామ మందిరం వెలుపల ప్రధాన గేటు నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అలాగే, రామమందిర నిర్మాణం కోసం భక్తులు పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను విరాళాలుగా సమర్పించారని, వాటిని భద్రపరచడం కష్టతరమవుతోందని పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన బంగారు, వెండి వస్తువులను ప్రస్తుతం ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో కరిగించి భద్రపరుస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, అయోధ్య ఆలయ ప్రతిష్ఠకు ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు గతవారం ఆహ్వానించిన విషయం తెలిసిందే. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు ట్రస్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను కూడా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ షేర్ చేసింది. 

 
కాగా, 2019 నవంబరులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో దశాబ్దాలుగా సాగుతోన్న అయోధ్య వివాదానికి తెరపడిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించిన కోర్టు.. మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.