రైలు ప్ర‌మాదం పై ప్ర‌ధాని ద్రిగ్భాంతి

* ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాల పరిహారం

విజ‌య‌నగ‌రం జిల్లాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదం ప్ర‌ధాని నరేంద్ర మోదీ ద్రిగ్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రధాని మోడీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2లక్షల 50 వేల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
 
కాగా, విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్‌ చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి తెలియజేశారు. సహాయ బృందాలను వెంటనే ఘటనాస్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఘటనాస్థలానికి మంత్రి బొత్స సత్యన్నారాయణను పంపించామని, స్థానిక కలెక్టర్‌, ఎస్పీకూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.

రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించాలన్నారు. అలాగే మరణించన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారికి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.