ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్

పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్ అంబానీకి వరుసగా హత్య బెదిరింపులు వస్తున్నాయి.  రెండు రోజుల్లోనే రెండు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేగుతోంది. అక్టోబర్‌ 27న రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తూ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. తాము కోరినంత ఇవ్వకపోతే మా వద్ద మంచి షూటర్లున్నారంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. 
 
దీనిపై ముకేశ్ అంబానీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాజాగా మరోసారి బెదిరింపు మెయిల్‌ను పంపారు. తొలి పంపిన మెయిల్‌కి స్పందించకపోవడంతో రూ. 200 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు తాజా మెయిల్‌లో పేర్కొన్నారు. రెండు రోజులకే ఆ మొత్తాన్న పది రేట్లకు పెంచారు. తమవద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్స్‌ ఉన్నారని అందులో పేర్కొన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
 కాగా, అంబానీ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండు బెదిరింపు మెయిల్స్‌ ఒకే అకౌంట్‌ నుంచి వచ్చాయని, షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు.  అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
2022 ఆగస్టు 15న రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని ఆగంతుకుడు బెదిరించాడు.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటన జరిగిన వారం రోజులకే వాహనం యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు.  ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేయే ప్రధాన సూత్రధారిగా తెలిపింది. దీంతో వాజేను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్రం భద్రత కల్పిస్తోంది.

కాగా, 2021 ఫిబ్రవరి 24 అర్ధరాత్రి బాగా పొద్దుపోయాక ఓ ఆకుపచ్చ రంగు స్కార్పియో కారును మైఖేల్ రోడ్డులో ఉన్న ముకేశ్‌ అంబానీ నివాసం అంటిల్లాకి 500 మీటర్ల దూరంలో పార్క్‌ చేశారు. ఆ వాహనంతో పాటుగా అక్కడికి వచ్చిన ఇన్నోవా కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది.  మర్నాడు ఉదయం అంబానీ నివాసం అంటిల్లా సెక్యురిటీ సిబ్బంది ఈ వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో కారుని పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. అందులో 20 జిలిటెన్ స్టిక్స్ గుర్తించారు. అంతేగాకుండా నీతా, ముకేశ్‌ అంబానీలను బెదిరిస్తూ అందులో ఒక నోట్‌ కూడా దొరికింది.