కొచ్చికి ఈశాన్యంవైపు 10కి.మీల దూరంలో ఉన్న కలమస్సెరి అనే ప్రాంతంలోని యహోవా కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఆదివారం ప్రార్థనలు మొదలైన కొంతసేపటికి పేలుళ్లు సంభవించాయి. “ప్రార్థనలు చేస్తుండగా.. పేలుడు శబ్దం వినిపించింది. కొంతసేపటికే మరో రెండు పేలుళ్లు జరిగాయి,” అని కన్వెన్షన్ సెంటర్ లోపల ఉన్న ఓ వృద్ధురాలు తెలిపింది.
ప్రార్థనలకు 2000 మంది హాజరైనట్లు సమాచారం. పేలుళ్లకు గల కారణాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఘటనాస్థలానికి వెళ్లిన సహాయక సిబ్బంది ఒకరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన 36 మందిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరు అక్కడ చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కేరళ పేలుళ్ల ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సీనియర్ అధికారులు ఘటనాస్థలానికి వెళుతున్నట్టు తెలిపారు.
“ఈ రోజు ఉదయం 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో పేలుడు సంభవించింది. కన్వెన్షన్ సెంటర్లో యహోవా విట్నెస్ రీజనల్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఈ నెల 27న అది మొదలైంది. ఈరోజే చివరి రోజు. 3 పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. నేను ఘటనాస్థలానికి వెళుతున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఈరోజే ఒక టీమ్ని ఏర్పాటు చేస్తున్నాము. 36 మంది గాయపడినట్టు తెలుస్తోంది,” అని డీజీపీ షేక్ దర్వేశ్ తెలిపారు.
పేలుడు నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలందరు డ్యూటీలో చేరి, క్షతగాత్రులకు అన్ని విధాలుగా సాయం చేయాలని కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ ఆదేశాలిచ్చారు. పేలుళ్లు ఎలా జరిగాయి? అన్న విషయంపై ఎన్ఐఏ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఏజెన్సీకి సంబంధించిన ఫోరెన్సీక్ బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలను సేకరిస్తోంది.
కేరళలో పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ ష పినరయి విజయన్కు ఫోన్ చేశారు. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఉగ్రవాదం కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ కేరళలో నిర్వహించిన ర్యాలీలో హమాస్ మాజీ కమాండర్ విర్చువల్గా పాల్గొనడం.. అది జరిగిన కొద్ది గంటల్లోనే క్రైస్తవుల ప్రార్థనా మందిరంలో పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ర్యాలీకి.. ఈ పేలుళ్లకు సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.
More Stories
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు