పారా ఆసియా క్రీడల్లోనూ 111 పతకాలు సాధించిన భారత్

చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో తొలిసారిగా వంద పతకాలను సాధించింది. శనివారం జరిగిన పురుషుల 400 మీటర్ల పరుగులో భారత అథ్టెట్ దిలీప్‌ మహదు గవిత్‌ గోల్డ్ మెడల్ గెలిచి మెడల్స్ సంఖ్యను 100కు చేర్చాడు.
 
400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసిన దిలీప్‌ భారత్‌కు రికార్డు పతకాన్ని అందించాడు. మొత్తంగా ఆసియా పారా గేమ్స్‌లో భారత్ వంద పతకాలను సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రీడల్లో భారత్ మొత్తంగా 111 పతకాలను భారత్ సాధించింది. అందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి.
 
ఇక ఆసియా పారా గేమ్స్‌లో పతకాల సంఖ్యలో చైనా తొలిస్థానంలో ఉంది. చైనా 215 గోల్డ్ మెడల్స్ సహా 521 పతకాలు సాధించింది. రెండో స్థానంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ 44 స్వర్ణాలతో 131 పతకాలు, మూడో స్థఆనంలో జపాన్ 42 స్వర్ణాలతో 150 పతకాలు సాధించింది. నాలుగో స్థానంలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కొరియా 30 స్వర్ణాలతో 103 పతకాలు సాధించింది. 
 
భారత్ కొరియా కన్నా ఎక్కువ పతకాలే గెలిచినప్పటికీ స్వర్ణాలు తక్కువగా ఉండటంతో ఐదో స్థానంలో ఉంది. అంతకుముందు జకార్తాలో జరిగిన 2018 పారా గేమ్స్‌లో భారత్ 72 పతకాలు సాధించింది. అందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలు ఉన్నాయి.
మరోవైపు ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. “ఆసియా పారా క్రీడల్లో భారత్ 100 పతకాల మార్క్‌ను దాటింది. పారా అథ్లెట్ల అద్భుతమైన టాలెంట్, అంకిత భావం కారణంగానే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. క్రీడాకారులకు అభినందనలు” అని పోస్టు చేశారు పీఎం మోదీ.
 
ఇటీవలె జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు 107 పతకాలు సాధించారు. పాయింట్ల పట్టికలో 4 వ స్థానంలో నిలిచారు. దీంతో ఏషియన్ గేమ్స్, పారా ఏషియన్ గేమ్స్‌లో భారత్ తొలిసారి వంద పతకాలు సాధించింది.