కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై ఆదిదంపతుల జలవిహారం

సువర్ణ కాంతుల విద్యుత్ దీపాలంకరణలో, మిరమిట్లు గోలిపే బాణాసంచా వెలుగులు, రంగురంగుల రాయించ రథంపై పరమేశ్వరుడు పక్కనే సిగ్గులోలుకుతూ కూర్చున్న దుర్గమ్మతో కలసి కృష్ణమ్మ అలలదారుల్లో హంస వాహనంపై మెల్లమెల్లగా ముందుకు సాగుతున్న అద్భుత దృశ్యాన్ని తనివి తీర చూసి భక్తులు తన్మయత్వం చెందారు. 
ఆకాశాన వెన్నెల వెలుగులు, తీరాన భక్తకోటి పరవశ కెరటాల నడుమ శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారు హంస వాహనంపై కృష్ణమ్మ వడిలో విహరించారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తకోటి జయ జయ ద్వారాలు వెంటరాగా స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పూజల అనంతరం కృష్ణానదిలో హంస వాహనంపై ఊరేగించారు.

శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు అనంతరం సోమవారం సంధ్య సమయాన త్రిలోకసంచారిని త్రిశక్తి రూపిని అయిన కనకదుర్గమ్మ వారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారితో కలిసి విహరించిన తీరు నదీ తీరాన దేదీప్యమానంగా వెలుగొందుతూ కనిపించింది. జై భవాని జై జై భవాని అంటూ భక్తులు ఒకవైపు జేజేలు పలుకుతుండగా అంబరం అంటే రీతిలో సంబరమై తెప్పోత్సవం కృష్ణమ్మ మురిసిపోయేలా కొనసాగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నిర్వహించిన తపోసవ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు.

రంగ రంగ వైభవంగా కొనసాగుతున్న జల విహారాన్ని భక్తులంతా ప్రకాశం బ్యారేజీ దుర్గా ఘాటు కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు జన హారంల ఏర్పడి వీక్షించారు. స్వామి వారిలో ఉత్సవ విగ్రహాలను మొదట మెట్ల మార్గం ద్వారా కనకదుర్గ నగరం నుండి దుర్గా ఘాటుకు తీసుకువచ్చిన వేద పండితులు వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

దుర్గాఘాట్‌ నుంచి ప్రారంభమైన తెప్పోత్సవాన్ని చూడటానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు. హంసవాహనం పైనకేవలం 31 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతుల మధ్య తెప్పోత్సవం జరుగుతోంది. మూడేళ్ల తర్వాత భక్తులకు స్వామివారు నదీవిహారం చూసే భాగ్యాన్ని కల్పించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో బాణా సంచా సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాఘాట్‌తో పాటు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి తెప్పోత్సవాన్నిభక్తులు వీక్షించారు.

పురవీధుల్లో హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపు

ఒకవైపు కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై గంగా, పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారు నదీ విహారం చేస్తుండగా, మరోవైపు నగరపురవీధుల్లో ప్రత్యేక హంస వాహనంపై అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగారు. మేల తాళాలు, వేదమంత్రాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో శ్రీ దుర్గమ్మ తల్లి సోమవారం సాయంత్రం నగర పూర వీధుల్లో విహరించారు. 

నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గతంలో ఎన్నడూ నిర్వహించిన విధంగా మొట్టమొదటిసారి శత చండీ యాగాన్ని ఉత్సవ కమిటీ నిర్వహించింది.

మూడు దశాబ్దాల తర్వాత విజయవాడ నగరంలో అతిపెద్ద ఎత్తున మహా శత చండి యాగంతో శరన్నవరాత్రి మహోత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు. మైసూరు తరహాలో దసరా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు నగరవాసులు తరలివచ్చారు. ప్రభల ఉత్సవం సాంస్కృతిక నృత్య కార్యక్రమాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని చిన్ని హాజరయ్యారు.