ఎట్టకేలకు తెరుచుకున్న రఫా సరిహద్దు

హమాస్ మిలిటెంట్లే లక్షంగా ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో గాజా ప్రాంతం అతలాకుతలమవుతోంది. యుద్ధ పరిస్థితులతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. అన్న పానీయాలు,ఔషధాలు, ఇతర మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈజిప్టు- గాజా సరిహద్దుల్లో దాదాపుగా రెండు వారాలుగా మూతపడిన రఫా సరిహద్దు పాయింట్‌ను శనివారం తెరిచారు. 

దీంతో ఐరాస సంస్థలు సేకరించిన సామగ్రితో కూడిన వందలాది వాహనాలు ఈజిప్టులోంచి గాజాలోకి ప్రవేశించాయి.ఆ సామగ్రిని చిన్న వాహనాల్లోకి ఎక్కించి గాజాలోని ఇతర ప్రాంతాలకు చేరవేయనన్నుట్లు తెలుస్తోంది. వాస్తవానికి శుక్రవారమే దాదాపు 200 ట్రక్కుల్లో మూడు వేల టన్నులకు పైగా సామగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది.  

అయితే కేవలం 20 ట్రక్ లను మాత్రమే అనుమతించారు. ఈ సహాయం సముద్రంలో నీటి బిందు వంటిదని ఐరాస పేర్కొక్కన్నది. వేలాది మందికి నిత్యావసరమైన ఇంధనంను కూడా అనుమతించాలని కోరుతున్నారు. కానీ ఇంధనం హమాస్ తీవ్రవాదులకు చేరే అవకాశం ఉందని ఇజ్రాయిల్ అనుమతించడం లేదు.

అయితే ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు వీలుగా వాటికి అత్యవసర మరమ్మతులు చేపట్టారు.ఈ ట్రక్కుల శనివారం లేదా ఆ తర్వాత గాజాలోకి ప్రవేశిస్తాయని ఐరాస తెలిపింది. యుద్ధం నుంచి తప్పించుకుని ఈజిప్టులోకి ప్రవేశించడం కోసం వందలాది మంది విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్న వారు సైతం సరిహద్దుల్లో వేచి ఉన్నారు. 

వాహనాలు రఫా పాయింట్ మెయిన్ గేట్‌గుండా గాజాలోకి ప్రవేశించే సమయంలో అక్కడి ప్రజలు ఆనందంగా చప్పట్లు చరుస్తూ, నినాదాలు చేస్తూ వాటికి వీడ్కోలు పలకడం కనిపించింది. దాదాపు వారం రోజలు పాటు ఉన్నతస్థాయి దౌత్య యత్నాల తర్వాత రఫా సరిహద్దులు తెరుచుకోవడం సాధ్యమయింది. ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలోకి అన్ని సరఫరాలను నిలిపి వేయంంతో పాటుగా వైమానిక దాడులను ముమ్మరం చేయడంతో ఈజిప్టు రఫా సరిహద్దు పాయింట్‌ను మూసి వేసింది.

దీంతో గాజా ప్రాంతంలోని దాదాపు 23లక్షల మంది ప్రజలు ఒక పూట తిండి, మురికి నీటితో బతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ సహా పలు దేశాల నేతలు జరిపిన చర్చల ఫలితంగా మానవతా సాయాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది.

గాజాపై భూతల దాడికి అనుమతి

మరో వైపు గాజాలోకి ప్రవేశించడానికి తమ సైనిక బలగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై ఇటీవలి పాశవిక దాడుల్లో పాల్గొన్న హమాస్ ఉగ్రవాదులను గుర్తించి, అంతమొందించడమే తమ లక్షమని పేర్కొన్నారు. 

హమాస్ సొరంగాలు ప్రపంచంలోనే అతి పెద్ద స్మశానాలుగా మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమ బలగాలు ఎప్పుడు గాజాలోకి అడుగుపెడతాయనే ప్రణాళికల గురించి మాట్లాడబోనని చెప్పారు. పైగా, 2005లో తాము వదిలిపెట్టిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఇజ్రాయెల్‌కు లేదని కూడా ఆయన చెప్పారు.