డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమెపై మరోసారి బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విరుచుకుపడ్డారు. డబ్బు కోసం తన పార్లమెంట్ లాగిన్ ఐడీని అమ్ముకున్నట్లు ఎంపీ మహువాపై ఆరోపణలు చేసిన దూబే మరో బాంబు పేల్చారు. ఎంపీ మహువా భారత్ లో ఉన్న సమయంలోనే ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీని మాత్రం దుబాయ్ నుంచి ఓపెన్ చేశారని దూబే ఆరోపించారు.
నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ విషయాన్ని దర్యాప్తు ఏజెన్సీలకు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత తెలిపారు. దేశ భద్రతను డబ్బు కోసం ఎంపీ మహువా అమ్మేసుకున్నట్లు దూబే తన ఎక్స్ అకౌంట్లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని, ఆర్ధిక శాఖ, సెంట్రల్ ఏజెన్సీలన్నీ ఎన్ఐసీనే వాడుతుంటాయని దూబే తెలిపారు.
“ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు దీనిపై రాజకీయం చేయాలనుకుంటున్నాయా? ఇక దీనిపై నిర్ణయం ప్రజలదే” అని నిషికాంత్ దూబే మహువా పేరు చెప్పకుండా పరోక్షంగా ఆరోపణలు చేశారు. అయితే ఏ ఏజన్సీకి సమాచారం అందిందనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
మరోవైపు దూబే చేసిన ఫిర్యాదు లోక్సభ ఎథిక్స్ కమిటీకి చేరింది. ఈ విషయంపై 26వ తేదీన కమిటీ ముందుకు రావాలని ఆయన్ను ఆదేశించారు. ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అదానీపై లోక్సభలో ప్రశ్నలు వేసేందుకు వ్యాపారవేత్త హీరానందని నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఎంపీ మహువాపై ఆరోపణలు ఉన్నాయి.
కాగా, ఎథిక్స్ కమిటీకి దర్శన్ ఇచ్చిన అఫిడవిట్ను ప్రధాని కార్యాలయమే రూపొందించి, ఆయనపై ఒత్తిడి తెచ్చి సంతకం చేయించిందని మహువా ఆరోపించిన నేపథ్యంలో దుబాయ్లో ఉండే దర్శన్ మళ్లీ అఫిడవిట్ సమర్పించారు. దీనిపై తమ సమక్షంలోనే ఆయన సంతకం చేశారని అక్కడి కాన్సులేట్ జనరల్ కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, మహువా లోక్సభ లాగిన్ లీక్ వ్యవహారం ఆమె వ్యక్తిగత విషయమని, జోక్యం చేసుకోబోమని టీఎంసీ స్పష్టం చేసింది.
More Stories
విపక్షాలకు పాకిస్థాన్పై ప్రేమ? భారత సైన్యంపై ద్వేషం!
నేడు 92 స్థానాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్
కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు