పురుషులకు సంతాన నియంత్రణ ఇంజెక్షన్‌

పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను తీసుకువస్తున్నది. 

ఈ ఇంజెక్షన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయి. ఢిల్లీ, ఉదంపూర్‌, లూధియానా, జైపూర్‌, ఖరగ్‌పూర్‌లోని దవాఖానల్లో ఈ ట్రయల్స్‌ నిర్వహించారు. 25-40 ఏండ్ల మధ్య వయసున్న 303 మందిపై నిర్వహించిన ఫేజ్‌3 ట్రయల్స్‌ ఫలితాలను ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ యాక్సెస్‌ ఆండ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ఇంజెక్షన్‌ సమర్థంగా పనిచేస్తున్నదని, దుష్ప్రభావాలు కూడా పెద్దగా లేవని ట్రయల్స్‌లో తేలింది.

పురుషులకు ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా స్త్రీలు గర్భం దాల్చకుండా దీన్ని రూపొందించారు. పురషులు ఈ ఇంజెక్షన్‌ను తీసుకోవడం వల్ల వీర్య కణాల్లో శక్తి తగ్గుతుంది. దీంతో మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గుతాయని ఐసీఎంఆర్‌ ట్రయల్స్‌లో తేలింది. పిల్లలు పుట్టకుండా పురుషుల్లో నిరోధించేందుకు వ్యాసెక్టమీ పద్ధతిని ఇప్పటివరకు వినియోగిస్తున్నారు. అయితే అందులోనూ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.

దీంతో కొత్త రకం చికిత్స అవసరం అయింది.  ఐఐటీ- ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్‌ సుజోయ్‌ కె గుహ నేతృత్వంలో ప్రపంచంలో మొదటిసారిగా పురుషుల్లో శుక్రకణాల విడుదలను నిలువరించేందుకు రివర్సబుల్‌ ఇన్‌హిబిషన్‌ ఆఫ్‌ స్పెర్మ్‌ అండర్‌ గైడెన్స్‌ (ఆర్‌ఐఎస్‌యూజీ) ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు.

 డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ జనరల్‌ ఇండియా (డీసీజీ) అనుమతితో ఫేజ్‌-3 ట్రయల్స్‌ నిర్వహించారు. తాజాగా నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఆర్‌ఐఎస్‌యూజీ ఇంజెక్షన్‌ విజయవంతంగా పురుషుల్లో సంతాన నిరోధకంగా పని చేసినట్టు పేర్కొంది. 

అజూస్పెర్మియా (ఉద్వేగ సమయంలో స్రవించే ద్రవాల్లో శుక్రకణాలు లేకపోవడం)కు సంబంధించి ఆర్‌ఐఎస్‌యూజీ ఇంజెక్షన్‌ 97.3 శాతం సమర్థవంతంగా పని చేసినట్టు తెలిపింది. అదే సమయంలో 99.02 శాతం గర్భ రాకుండా నిరోధించినట్టు పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా లేవని వారు తెలిపారు.