ప్రగతిభవన్‌కు ఈసీ నోటీసులు

తెలంగాణ ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి రాష్ట్ర్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. అన్ని పార్టీల కార్యక్రమాలపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే తనిఖీల్లో కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీల ఫిర్యాదులపై కూడా ఈసీ తక్షణమే స్పందిస్తోంది.  తాజాగా ప్రగతిభవన్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో అధికార పార్టీ  బిఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.   ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా పలువురు ఇతర పార్టీల నాయకులు వచ్చి సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరడం, ఇక్కడి నుండే బిఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి బి ఫారంలను అందిస్తుండటం వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా కాంగ్రెస్ తన ఫిర్యాదులో ప్రస్తావించింది.

ఇదే అంశంపై గురువారం సాయంత్రం సీఈవో వికాస్‌రాజుతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌ భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌పై వచ్చిన ఫిర్యాదుపై అధికారులంతా చర్చించారు. ఎవరికి నోటీసులు ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ప్రగతిభవన్ నిర్వహణ అధికారికి ఈసీ నోటీసులు పంపించింది. ప్రగతిభవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై ఈసీ వివరణ కోరింది.