వైసిపి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు స్పందించాలి

 
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై ప్రజలు స్పందించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణు కుమార్ రాజు కోరారు. దేశంలో 28 వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు వుండగా, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో 11348 కేసులు వున్నాయని చెప్పారు. మార్గదర్శి సంస్థ పై ఫిర్యాదులు లేకుండానే కేసులతో వేధింపులకు గురి చేయడం అన్యాయం అని విమర్శించారు. 
 
తాను లీలా కృష్ణ టయోటా మోటార్స్ డబ్బులు తీసుకొని వాహనాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అంటూ సి ఐ డి కి ఫిర్యాదు చేసినా  చర్యలు లేవని చెప్పారు.  ఎవరైనా ప్రభుత్వ విధానాలు విమర్శిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని వోడించాలని కోరారు. 
 
పరోక్షంగా మంత్రి రోజాపై టిడిపి నేత అనుచిత వాఖ్యాలను ప్రస్తావిస్తూ రాజకీయాల్లో మహిళల పట్ల దిగజారి మాట్లాడడం మంచిది కాదని హితవు చెప్పారు.  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో బీజేపీ కి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే,  ప్రతిపక్ష నేతల అరెస్టులు కక్ష సాధింపు చర్యలు మాత్రమే అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియదని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్రంలో మద్యం అమ్మకాలలో పెద్దఎత్తున జరుగుతున్న అవినీతిపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని తాను రెండేళ్ల క్రితమే డిమాండ్ చేశానని ఆయన  గుర్తు చేశారు. చీఫ్ లిక్కర్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం ఆదాయం తగ్గింది అనడం అవాస్తవం అంటూ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.