128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్!

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రికెట్‌ ను  దాదాపు 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌కు చేర్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను సైతం చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రికెట్‌తో పాటు ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ సైతం ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. 
 
ఈ నెల 15 నుంచి ముంబయిలో జరుగనున్న ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోన్నట్లు సమాచారం.  ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు పలు క్రీడలను చేర్చాలన్న నిర్ణయాన్ని ఎల్ఏ28 కమిటీ తీసుకోగా దాన్ని ఆమోదించాల్సిందిగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి సిఫారసు చేసింది. 
 
దీన్ని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ సైతం ధ్రువీకరించింది. చాలా సంవత్సరాలుగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ప్రయత్నాలు జరుగుతున్నా కార్యరూపం దాల్చలేదు. అయితే, ఐఓసీ భారత ఉపఖండంలోని మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల టీ-20 క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చనున్నట్లు తెలుస్తున్నది. 
 
2024 పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రసార హక్కులు రూ.158.6కోట్లు కాగా, క్రికెట్‌ను చేరిస్తే 2028 నాటికి ప్రసార హక్కులు రూ.1,525 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇదిలా ఉండగా, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలన్న సిఫారసుపై కమిటీ హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్ల ప్రక్రియ తర్వాత  ఎల్ఏ 28 ఆర్గనైజింగ్‌ కమిటీతో కలిసి ఐసీసీ క్రికెట్‌ను ఒలింపిక్స్‌ జాబితా చేర్చనున్న క్రీడల జాబితాలో చేర్చిందని ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే పేర్కొన్నారు. 
 
ఈ ప్రతిపాదనను తుది ఆమోదం కోసం ఐఓసీకి పంపారని తెలిపారు. భారత్‌లో జరిగే ఐఓసీ సెషన్స్‌ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, చాలా సంవత్సరాల తర్వాత ఆసియా గేమ్స్‌లోకి క్రికెట్‌ను ప్రవేశపెట్టగా భారత్‌ రెండు పతకాలను సాధించింది. ఆసియా గేమ్స్‌లో పురుషుల, మహిళల క్రికెట్‌లో రెండు బంగారు పతకాలు భారత్ కే వరించాయి.