ప్రపంచ రికార్డు సృష్టించిన కింగ్ కోహ్లీ

ఆస్ట్రేలియాపై విజయంతో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియాగా ఘనంగా ప్రారంభించింది. కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ స్టార్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా అనిపించారు. 

తమ అపార అనుభవంతో తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఆసీస్‌ పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. 

ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన నాన్ ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. కోహ్లీ ఇప్పటివరకు 113 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. ఈ క్రమంలో 112 సార్లు 50+ స్కోర్లు సాధించిన శ్రీలంక మాజీ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు.

అలాగే ఈ మ్యాచ్‌లో పట్టిన క్యాచ్‌ వన్డే ప్రపంచకప్‌లలో కోహ్లీకి 15వది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. కుంబ్లే 14 క్యాచ్‌లు పట్టగా, 15 క్యాచ్‌లతో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. దీంతోపాటు జట్టు విజయం సాధించినప్పుడు చేజింగ్ సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 

అలాగే వన్డే ప్రపంచకప్‌లలో కోహ్లీకి ఇది 9వ 50+ స్కోర్. దీంతో ఈ టోర్నీలో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ 21 సార్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

ఐసీసీ వైట్‌బాల్ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఐసీసీ మెగాటోర్నీల్లో సచిన్ టెండూల్కర్ 58 ఇన్నింగ్స్‌ల్లో 2719 రన్స్ చేయగా, కోహ్లీ 64 ఇన్నింగ్స్‌ల్లో 2730 ప్లస్ రన్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 64 ఇన్నింగ్స్‌ల్లో 2422 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
 
ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులే కాకుండా అత్యధిక 50 ప్లస్ రన్స్, బెస్ట్ యావరేజ్, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. ఇక వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యంత వేగంగా 11 వేల పరుగుల మైలు రాయి అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.

మరోవంక, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. అదేవిధంగా,  ప్రపంచకప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో టాప్ 3 బ్యాటర్లు డకౌట్ అయినప్పటికీ ఆ జట్టు గెలవడం ఇదే మొదటిసారి.