నెల్లూరు జిల్లాలో ఏపీసిఎల్సి ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాదుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లో పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది సురేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. న్యాయవాది సురేష్తో పాటు అతని బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య నివాసంలో సోదాలు చేపట్టారు. క్రాంతి చైతన్యకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు వున్నట్లు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్లో పౌరహక్కుల సంఘం నాయకురాలు భవానీ నివాసంలో సోదాలు జరుపుతున్నారు. మావోయిస్టులతో సంబంధాలు, వాళ్ల కార్యకలాపాలకు సహకరిచండంపై విచారణ చేపట్టారు. మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రపడినవారితోపాటు, పౌరహక్కులు, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న పలువురి నివాసాలను జల్లెడపడుతున్నారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కులనిర్మూల పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో కులనిర్మూలన పోరాట నేత మిస్కా కృష్ణయ్య నివాసంలో సోదాలు చేపట్టారు. నెల్లూరులో పౌర హక్కుల సంఘం నాయకులు అరుణ, వెంకటేశ్వరరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.
విజయవాడలో కూడా ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ శివార్లలోని పినైనవరం గ్రామంలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాధ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. విజయవాడ చిట్టినగర్లో అడ్వకేట్ అరసవిల్లి కృష్ణ, పూర్ణనందం పేటలో అడ్వకేట్ ఆంజనేయులు నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వీరికి నోటీసులు ఇచ్చి, అవసరమైతే అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు.
More Stories
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం.. సిఐడి దర్యాప్తుకు ఈసీ ఆదేశం
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు