మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు

ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబదించి మాజీ మంత్రి డా. నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా ఈ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లను నిందితులుగా చేర్చుతూ సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో ఏ14గా లోకేశ్‌కు 41ఏ కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4 న లోకేష్ సిఐడి ఎదుట హాజరుకానున్నారు. ఇప్పుడు నారాయణ కూడా విచారణలో భాగంగా అదే రోజు హాజరుకావాలని సిఐడి పేర్కొంది.  రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు హయాంలో అవినీతి చోటు చేసుకుందని వైస్సార్సీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. 
 
అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అంతా బాబు కనుసన్నల్లోనే జరిగిందని పేర్కొంటున్నారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో చంద్రబాబు సీఆర్‌డీఏ ఎక్స్‌ అఫీషియో చైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు మాస్టర్‌ ప్లాన్‌ గురించి మొత్తం ముందే తెలుసని సిఐడి చెబుతున్నది. 
రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు ప్రక్రియలో చంద్రబాబుకి పూర్తి భాగస్వాయ్యం ఉందని సిఐడి ఆరోపిస్తుంది.
అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం కూడా భారీగా ప్రయోజనం పొందినట్లు సీఐడీ చెప్పుకొస్తోంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని దర్యాప్తులో వెల్లడైందని, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌లో నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు.. సీడ్‌ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారన్నదానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీఐడీ చెపుతుంది.