సిబిడిటి చైర్మన్‌ నితిన్‌ గుప్తా పదవీ కాలం పొడిగింపు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) చైర్మన్‌ పదవికి నితిన్‌ గుప్తా పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.  సిబిడిటి చైర్మన్‌ పదవికి నితిన్‌ గుప్తాను తిరిగి నియమించేందుకు కేంద్ర మంత్రివర్గం నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సిబ్బంది, శిక్షణ విభాగం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆయనను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించారు. 

ఆయన నియామకం 1 అక్టోబర్‌ 2023 నుండి 30 జూన్‌ 2024 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు చెల్లుబాటు అవుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ అనేది ఆదాయపు పన్ను శాఖలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. సిబిడిటి చైర్మన్‌ నేతృత్వంలో  ఉంటుంది. ఈ బోర్డులో 6 మంది సభ్యులు ఉంటారు. 

అయితే   నితిన్‌ గుప్తాను సిబిడిటి చైర్మన్ గా  తిరిగి నియమించడానికి రిక్రూట్‌మెంట్‌ నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి నితిన్‌ గుప్తా పదవీకాలం శనివారంతో ముగియనుండగా ముందురోజు  ఆయన పదవీకాలాన్ని మరో 9 నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం గమనార్హం.

నితిన్‌ గుప్తా 1986 బ్యాచ్‌కి చెందిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారి. గతేడాది జూన్‌లో సిబిడిటి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన హయాంలో ఆదాయపు పన్ను శాఖ అత్యధిక ఐటిఆర్‌లను నమోదు చేసింది.  ఈసారి 7 కోట్లకు పైగా ఐటిఆర్‌లు దాఖలయ్యాయి. వీటితో  పాటు రిటర్న్‌ల ప్రాసెసింగ్‌లో పట్టే సమయాన్ని నితిన్‌ గుప్తా గణనీయంగా తగ్గించారు.