తెలంగాణ పర్యటనలో రూ 13,500 కోట్ల కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే విధంగా ప్రధాని పర్యటన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా  పార్టీ నిర్వహించే సభలలో పాల్గొనటంతో పాటు రూ.13,500 కోట్ల కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు జాతికి అంకితం చేయనున్నారు. మోదీ ప్రారంభించబోయే రైల్వేలైన్ తో హైదరాబాద్, గోవా మధ్య 102కిమీ దూరం తగ్గుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాచిగూడ నుంచి రాయచూర్ రైల్వే లైన్‌ను మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. 

అక్టోబర్ 3న నిజామాబాద్ పర్యటనలో భాగంగా 8,021కోట్ల ప్రాజక్టులను మోదీ ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మోదీ అంకితం చేస్తారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా పవర్, హెల్త్, రైల్వే ప్రాజక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.1369కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్‌కు మోదీ భూమిపూజ చేస్తారు. ఎయిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు.

ప్రధాని కార్యక్రమ వివరాలు

* అక్టోబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకి హైదారాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి మోదీ రానున్నారు.

*1:45 నుంచి 2.15 వరకు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. 3.05 గంటలకు మహబూబ్ నగర్ చేరుకొని 3.15 నుంచి 4.15 వరకు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

* నిజామాబాద్‌లో అక్టోబర్ 3న రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. పసుపు బోర్డును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ప్రధాని శ్రీకారం చుట్టనున్న కార్యక్రమాలు

• నాగ్‌పూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి రూ. 6400 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులు శంకుస్థాపన

• హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్‌కు సంబంధించిన ఎన్ హెచ్- 365బిబి రహదారి ప్రాజెక్ట్‌లో 59 కి.మీ పొడవు గల సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లేనింగ్‌లకు రూ. 2460 కోట్ల భారతమాల పరియోజన కింద అభివృద్ధి చేయబడిన రహదారి ప్రారంభోత్సవం.

• రూ. 500కోట్లు – ‘37 కి.మీల జక్లెయిర్ – కృష్ణా కొత్త రైల్వే లైన్’ శంకుస్థాపన

• కర్ణాటకలోని హాసన్ నుండి చెర్లపల్లి వరకు రూ. 2710 కోట్ల ఆయిల్ అండ్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, అంకితం

• కృష్ణపట్నం నుండి హైదరాబాద్ (మల్కాపూర్) వరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రూ. 1940 కోట్ల మల్టీ-ప్రొడక్ట్ పెట్రోలియం పైప్‌లైన్  శంకుస్థాపన

• హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఐదు కొత్త భవనాలను మోదీ ప్రారంభించనున్నారు. (స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ & స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, లెక్చర్ హాల్ కాంప్లెక్స్ , సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & కమ్యూనికేషన్).