జ‌డ్జీల‌పై దూష‌ణ‌లు… 26 మందికి హైకోర్టు నోటీసులు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత ఆయన పిటిషన్‌లను విచారించిన జడ్జిలపై సోష‌ల్ మీడియాలో రాజకీయపరంగా ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని పేర్కొంటూ ఏపీ హైకోర్టులో ప్ర‌భుత్వం దాఖ‌లు క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది.

న్యాయస్థానాలు, జడ్జిలను దూషించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ లో కోరారు ప్రభుత్వ ఏజీ. గడచిన రెండు వారాల్లోని పరిణామాలను పిటిషన్‌ లో వివరించారు. కోర్టుల గౌరవానికి భంగం కలిగించారని తెలిపారు. న్యాయవిధులను నిర్వర్తిస్తున్న వారిపై దూషణలకు దిగారంటూ పిటిషన్‌ లో వెల్లడించారు. 

న్యాయవ్యవస్థకు ఉన్న విలువలను ధ్వంసం చేసేలా వ్యవహరించారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ట్విట్టర్, ఫేస్ బుక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ. బుద్ధా వెంకన్నతో సహా 26 మందిని ప్రతివాదులుగా చేర్చారు.  ఇద్దరు హైకోర్టు జడ్జిలు, ఏసీబీ జడ్జి కుటుంబాలు టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. 

జడ్జిలను ట్రోలింగ్ చేయటానికి ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించారని చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాలకు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు.