నాకు కెటిఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు

తనకు మంత్రి కెటిఆర్ సర్టిఫికెట్ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ అవసరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కిషన్ రెడ్డి అసమర్థుడు, మోస్ట్ అన్ ఫిట్ లీడర్ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ కేటీఆర్ వాఖ్యాలను కొట్టిపారేసారు.

అక్టోబర్ 3న నిజామాబాద్ పట్టణంలోని జిజి గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారని తెలిపారు.

 అక్టోబర్ 1న మహబూబ్ నగర్‌లో జరిగే బహిరంగ సభలో, 3న నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. పాలమూరు సభలో పలు అభివృద్ధి పనులకు, ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందూరులో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూ.6 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ పవర్ ప్లాంటును మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారని వెల్లడించారు. 

హైదరాబాద్ నుంచి మొదలు అదిలాబాద్ వరకు బిజెపి బలోపేతమైందని చెబుతూ  ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయని, గిరిజనులతో పాటు స్థానిక ప్రజలు బిజెపిని ఆదరించి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. తమ పార్టీ పై విమర్శలు చేసే నైతిక హక్కు కెటిఆర్, బిఆర్‌ఎస్ నేతలకు లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కెసిఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు.

రానున్న శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్ లో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు.