హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మరో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు

హైదరాబాద్ విమానాశ్రయం మరోసారి ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. “నేషనల్ ఎనర్జీ లీడర్ “, “ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ ” అవార్డులను కైవసం చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు స్థిరమైన, శక్తి పరిరక్షణ పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంస్థ నిపుణులు వెల్లడించారు. 
 
వినూత్న కార్యక్రమాల ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి నిరంతర కృషి చేస్తున్నట్టుగా నిపుణులు గుర్తించి ఈ అవార్డును అందచేస్తున్నట్టు ప్రకటించారు. సీఐఐ  దేశ రాజధాని డిల్లీలో నిర్వహించిన “ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ” 24వ జాతీయ అవార్డుల వేడుకల్లో ఈ అవార్డులను కైవసం చేసుకుంది.
 
ఈ విమానాశ్రయంకు వరుసగా అయిదుసార్లు అవార్డులు దక్కగా, 7వ ఏడాది కూడా ” నేషనల్ ఎనర్జీ లీడర్ ”, ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్’ అవార్డులతో గుర్తింపు పొందింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ శంషాబాద్ ఎయిర్ పోర్టు ఇంధన సమర్ధత, స్థిరమైన కార్యక్రమాలను అవలంబించడంలో ముందంజలో ఉందని తెలిపారు.
 
కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి తగిన కార్యాచరణ చేపట్టి, సామర్థ్యాలను ఆప్టిమైజ్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. సమర్థవంతమైన సాంకేతికతలలో పెట్టుబడి పెడుతున్నామని పేర్కొంటూ 2030 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. పర్యావరణాన్ని సంరక్షించుకునేందుకు తాము ప్రతి అంశానికి కట్టుబడి ఉన్నామని ప్రదీప్ తెలిపారు.