గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందే

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు సబబేనని కోర్టు తెలిపింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. 
 
అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకొని మళ్లీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహించాలని హైకోర్టు టీఎస్పీఎస్సీకి తేల్చి చెప్పింది.  దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోసారి నిర్వహించక తప్పనిపరిస్థితి నెలకొంది. పేపర్ లీకేజీ వ్యవహరం తర్వాత జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించింది. ఈ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేదని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. 
 
రెండోసారి నిర్వహించిన పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు పరీక్ష మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చారు. ఈ విచారణలో హైకోర్టు టీఎస్పీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా రద్దైన పరీక్ష నిర్వహణలో మళ్లీ అదే నిర్లక్ష్యం సరికాదని స్పష్టం చేసింది.
బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని నోటిఫికేషన్ లో ప్రకటించ ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించింది. మీ నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారా? ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న వారి పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించింది.  2022 ఏప్రిల్‌ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 3,80,202 మంది గ్రూప్ 1 కు అప్లై చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించగా పేపర్ లీకేజీ వ్యవహారంతో ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది జూన్ 11 మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించగా… ఈ పరీక్షను తాజాగా హైకోర్టు రద్దు చేసింది.