భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలను నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. భారత్ తో ఏదో ఒక చోట గొడవ పడాలని చూసే దాయాది దేశం చైనా తాజా నిర్ణయం మరో రెండు దేశాల సంబంధాలలో చిచ్చురేపింది. అరుణాచల్ప్రదేశ్కు చెందిన ముగ్గురు అథ్లెట్స్కు ఆ దేశం వీసాలు మంజూరు చేయలేదు. ఆసియా క్రీడల్లో వారు పాల్గొనకుండా అడ్డుకుంది.
ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. ప్రతిగా చైనాలోని హాంగ్ జౌలో శనివారం జరగనున్న ఆసియా గేమ్స్ వేడుకల్లో పాల్గొనకూడదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించుకుని చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఉషు అనే మార్షల్ ఆర్ట్స్ క్రీడలో అరుణచల్ ప్రదేశ్ నుంచి ముగ్గురు ప్లేయర్లు 2023 ఆసియా క్రీడలుకు ఎంపికయ్యారు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా.. వీరికి షాక్ తగిలింది!
చైనాలో ఎంట్రీ కోసం అక్రిడీషన్ కార్డ్స్ చాలా కీలకం. అలాంటిది.. ఒనిలు తెగ, ఎంపుంగ్ లంగు ప్లేయర్లు.. తమ అక్రిడీషన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోలేక పోయారు. మూడో అరుణాచల్ప్రదేశ్ వాసి నెయ్నమ్ వంగ్సుకు అక్రిడీషన్ కార్డు వచ్చినా ఆమెను హాంగ్ కాంగ్ దాటి ప్రయాణాలు చేయకూడదని షరుతులు విధించింది చైనా.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆసియా క్రీడలకు ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులపై చైనా అధికారులు వివక్ష చూపారని ఆరోపించారు. అదే సమయంలో అరుణాచల్ భూభాగంపై వితండ వాదనలు చేస్తున్న చైనా దుర్భుద్దిని గమనించిన భారత్ ఆ రాష్ట్రం భారత్ అంతర్భాగమని స్పష్టం చేసింది. ప్రాంతం, జాతి ఆధారంగా చైనా వివక్ష చూపుతోందని ఆరోపించింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంతోపాటు, బీజింగ్లో కూడా ఈ నిర్ణయింపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.
“చైనా చర్యలకు వ్యతిరేకంగా భారత్ నిరసన వ్యక్తం చేస్తోంది. క్రీడాశాఖ మంత్రి తన చైనా ట్రిప్ను రద్దు చేసుకుంటున్నారు. అరుణాచల్ప్రదేశ్లోని క్రీడాకారులను చైనా టార్గెట్ చేస్తోంది. హంగ్జౌలో జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్కు వారికి అక్రిడీషన్ కార్డులు ఇవ్వలేదు. భారతీయులతో చైనా ఈ విధంగా ప్రవర్తిస్తుండటాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. అరుణాచల్ప్రదేశ్ అనేది ఎప్పటికీ భారత్లో భాగమే,” అని ఆరిందమ్ బగ్చి తెలిపారు.
“ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లాము. చాలా బలంగా మా వాదనలు వినిపించాము. కొందరు క్రీడాకారులను ఇలా నియంత్రించడం సరైనది కాదు. ఇది ఏషియన్ గేమ్స్ స్ఫూర్తికి విరుద్ధం,” అని ఆరిందమ్ బగ్చి వెల్లడించారు.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది