పార్టీ ఎంపీకి బీజేపీ షోకాజ్ నోటీస్

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ డానిష్ అలీపై లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. ఆయనను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో బిధూడీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బిధూడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణనలోకి తీసుకుంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శుక్రవారంనాడు ఆయనకు షోకాజ్ నోటీసులు పంపారు.

‘ముల్లా టెర్రరిస్ట్’ అంటూ బిధూడీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటు కొత్త భవనంలో అడుగుపెట్టగానే బీజేపీ అసలు ఉద్దేశాలు బయటపడ్డాయంటూ విమర్శలు గుప్పించారు.  కాగా, తనపై బిధూడీ చేసిన వ్యాఖ్యలపై డానిష్ అలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై దర్యాప్తు జరిపాలించాలని స్పీకర్‌ను కోరారు.

గురువారం చంద్రయాన్ 3 విజయంపై చర్చ సందర్భంగా బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని అభ్యంతరకర పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యలను ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించారు.  బిధూరీ వ్యాఖ్యల పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. డానిష్ అలీ గురించి బిధూరీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఇలాంటి పదజాలం ఇంతకు ముందెన్నడూ వినలేదు. పార్లమెంట్ కొత్త భవనం ఇలాంటి మాటలతో ప్రారంభం కావడం బాధాకరం. బిధూరీ వ్యాఖ్యలు బీజేపీ ఉద్దేశాన్ని తెలియజేస్తోందని ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి.

ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ఓబీసీలను , ముస్లింలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు.  ముస్లిం ఎంపీ పట్ల బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా దేశం లోని గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.