కెనడా పౌరుడు, ఖలిస్థానీ వేర్పాటువాద మద్దతుదారుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనేందుకు తమ వద్ద విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.
అయితే, జీ20 సమావేశాలకు ముందే కెనడా తన మిత్రదేశాలతో నిజ్జర్ హత్య విషయమై సంప్రదింపులు జరిపిందని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. భారత్ తీరును బహిరంగంగా ఖండించాలని విజ్ఞప్తి చేసిందని వెల్లడించింది. అయితే, అమెరికా సహా అనేక దేశాలు ఈ తరహా ప్రకటన చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని పేర్కొంది.
జీ20 సమావేశాలు ప్రధాని మోదీకి కీలకమని భావించిన ఆయా దేశాలు బహిరంగ ప్రకటనకు వెనకాడాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అంతేకాదు, భారత్తో దౌత్యసంబంధాలు నెరపడంతో అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లకు ఇది ఓ నిదర్శనమని కూడా వ్యాఖ్యానించింది. ఫైవ్ ఐస్ (ఐదు కళ్లు) దేశాలుగా పేరుపడ్డ అమెరికా, బ్రిటన్, న్యూజీల్యాండ్, అమెరికాలతో కెనడా ఈ సంప్రదింపులు జరిపినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ను భారత ప్రభుత్వం 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిని భారత్కు రప్పించే దిశగా కెనడాతో చర్చలు జరుపుతోంది. 2022లో పంజాబ్లో ఓ అర్చకుడి హత్య వెనకు అతడి పాత్ర ఉందని కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నిజ్జర్ను కెనడాలోని ఓ గురుద్వారా ఎదుట ఇద్దరు ఆగంతుకులు కాల్చి చంపేశారు.
ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ప్రధాని ట్రూడో కెనడా పార్లమెంటులో సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా, భారత దౌత్యవేత్తను కూడా కెనడా బహిష్కరించింది. కెనడా చర్యకు దీటుగా భారత్ దీటుగా స్పందించింది. భారత్లోని కెనడా దౌత్యవేత్త ఐదు రోజుల్లోపు దేశం వీడాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ దౌత్యవేత్త కెనడా తరపున భారత్లో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అనుమానంతోనే అతడిని భారత్ బహిష్కరించిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ట్రూడో మరోసారి స్పందించారు. భారత్ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే ఈ విషయంపై భారత్ దృష్టిసారించాలని కోరారు. ఖలిస్థానీ వేర్పాటువాదంపై కఠినచర్యలు తీసుకోవావలంటూ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాపై భారత్ ఒత్తిడి తెస్తోందని కూడా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
ఇలా ఉండగా, కెనడాతో దౌత్యపరమైన వివాదం నెలకొన్న నేపథ్యంలో అక్కడి ఎన్నారైలు, భారత విద్యార్థులకు కేంద్రం తాజాగా కీలక సూచన చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ఆమోదంతో నేరాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారత్లోని కెనడా పౌరులకు అక్కడి ప్రభుత్వం ఇలాంటి జాగ్రత్తలే చెప్పిన మరుసటి రోజే కేంద్రం ఎన్నారైలకు ఈ సూచనలు చేయడం గమనార్హం.
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్జీ ‘ఎక్స్’ వేదికగా కెనడాలోని ఎన్నారైలను ఈ మేరకు హెచ్చరించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలను వ్యతిరేకించే భారతీయ దౌత్యవేత్తలు, భారతీయులకు బెదింపులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి, గతంలో అలాంటి ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. అయితే, కెనడాలోని భారత దౌత్యకార్యాలయాలు స్థానిక అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఎన్నారైల భద్రత కోసం కృషి చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.
More Stories
జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం