మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా న్యాయమూర్తుల నియామ‌క ప్ర‌క్రియ

న్యాయ‌మూర్తుల నియామ‌క ప్ర‌క్రియ మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి నిర్దేశిత ప్ర‌మాణాలను రూపొందిస్తామ‌ని వెల్లడించారు. నియామ‌కాల‌కు అర్హులైన దేశంలోనే అత్యున్న‌త న్యాయ‌మూర్తుల‌ను మ‌దింపు చేసేందుకు విస్తృత ప్రాతిప‌దిక‌న సెంట‌ర్ ఫ‌ర్ ప్లానింగ్ అండ్ రీసెర్చి క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని సీజేఐ తెలిపారు. 

న్యాయ‌మూర్తులు, వారిచ్చిన తీర్పుల‌పై అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ మ‌దింపు చేప‌డ‌తార‌ని ఆయ‌న చెప్పారు. కోర్టుల్లో నియామకాల కోసం ఆబ్జెక్టివ్ ప్రమాణాలతో ఒక పత్రాన్ని తయారుచేస్తామని, దేశంలోని 50 మంది అత్యున్న‌త న్యాయ‌మూర్తుల‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానంలో నియమించేందుకు మ‌దింపు ప్ర్ర‌క్రియ సాగుతుంద‌ని చంద్రచూడ్ ప్రకటించారు. 

 న్యాయ‌మూర్తులే న్యాయ‌మూర్తుల‌ను ఎంపిక చేస్తార‌ని, నాలుగు గోడ‌ల మ‌ధ్య ఈ తతంగం సాగుతోంద‌ని, సుప్రీంకోర్టు కొలీజియం వ్య‌వ‌స్ధ‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. సుప్రీం కోర్ట్ కొలీజియం “క్లోజ్డ్ డోర్ సిస్టం”గా విమర్శలను ఎదుర్కొంది. మూడు దశాబ్ధాల కొలీజియం వ్య‌వ‌స్ధ‌లో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని, జ‌వాబుదారీత‌నం లేద‌నే అసంతృప్తి నెల‌కొంది.

కాగా, ప్ర‌జాస్వామ్యంలో ఏ వ్య‌వ‌స్ధ నూరు శాతం స‌జావుగా ఉండ‌ద‌ని సీజేఐ డీవై చంద్రచూడ్ గ‌తంలో వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల వ్యవస్థ సరిగ్గా లేదన్న మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కొలీజియాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.  కొలీజియం వ్యవస్థ లో మార్పు రావాలంటే ప్రస్తుత వ్యవస్థలో మన మార్గంలో పని చేయడమే పరిష్కారమని స్పష్టం చేశారు.