17న అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించిన విధంగా ఈ సారి కూడా జరుపుతామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు నిర్వహించలేదని చెబుతూ మజ్లిస్‌కు భయపడే తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించలేదని విమర్శించారు. 

నిజాం అరాచక పాలన నుంచి నాటి హైదరాబాద్ సంస్థానం విమోచన సందర్భంగా సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరేంది. బిజెపి గత 25 ఏళ్లుగా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలంటూ పోరాటం చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. చరిత్రలో ప్రతీ ప్రత్యేక ఘట్టానికి ఉత్సాహంగా, పండగగా, వేడుకగా జరుపుకుంటామని, కానీ రాష్ట్రంలో 75 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరం చెప్పారు. 

ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఆసక్తి చూపడం లేదని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణ గడ్డపై 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ త్రివర్ణ పతాకం ఎగరేస్, 75 ఏళ్ల తర్వాత అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారి చేతుల మీదుగా గతేడాది హైదరాబాద్‌లో ఉత్సవాలు జరిగాయని గుర్తు చేశారు. 

 మళ్లీ పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బిఅర్‌ఎస్ ప్రయత్నం చేస్తున్నయని ధ్వజమెత్తారు. ఆ రోజు రాజకీయ సభలకు ప్లాన్ చేసారని చెబుతూ అమిత్ షా పాల్గొనే కార్యక్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఆ పార్టీలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కాగా, రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని చెప్పారు. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ఆధ్వర్యంలో జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆహ్వానం పంపిస్తామని చెబుతూ సిఎం విమోచన దినోత్సవం వేడుకకు రావాలని ఆయన కోరారు.