కేసీఆర్‌ ఒక దొర అని, ఆయన దగ్గర అందరూ జీతగాళ్లే

కేసీఆర్‌ ఒక దొర అని, ఆయన దగ్గర అందరూ జీతగాళ్లే
కేసీఆర్‌ ఒక దొర అని, ఆయన దగ్గర అందరూ జీతగాళ్లేనని  రాష్ట్ర బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు.  వైరాలో  నియోజకవర్గస్థాయిలో బిజెపి పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఈటల ప్రసంగిస్తూ ఆదివాసీ గిరిజన జిల్లాలైన ఆదిలాబాద్‌, వరంగల్‌లలో కేవలం మూడేసి నియోజకవర్గాలు మాత్రమే గిరిజనులకు ఉన్నాయని గుర్తు చేశారు. 
 
అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు గిరిజన నియోజకవర్గాలున్నా గిరిజనులను కేసీఆర్‌ వంచిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‏కు బుద్ది చెప్పి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
 
వైరాలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ సీఎం కేసీఆర్‌ బాధితులేనని స్పష్టం చేశారు. ఇద్దరూ కేసీఆర్‌ వద్ద అవమానాలకు గురైనవారేనని ఆరోపించారు.  గిరిజన ఎమ్మెల్యేగా ఉన్న రాములునాయక్‌ ఇంకా పదవి నుంచి దిగిపోకముందే ఆయన అధికారాలకు మంత్రి పువ్వాడ ద్వారా కేసీఆర్‌ కత్తెర వేయించారని విమర్శించారు. ఇప్పుడు టిక్కెట్‌ లభించిన మదన్‌లాల్‌ కూడా గత నాలుగున్నరేళ్లుగా కేసీఆర్‌ నుంచి అవమానాలను అనుభవించినవాడేనని తెలిపారు. 
 
వైరా ఎమ్మెల్యేను ఆయన పదవీకాలం పూర్తికాకముందే ఆయన్ను కేసీఆర్‌ గడ్డిపరకలా తీసివేశారని విమర్శించారు. ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాములునాయక్‌ గిరిజన ఎమ్మెల్యే, పేదవాడు, నోట్లో నాలుక లేనివాడు కావడమే కాకుండా కేసీఆర్‌కు అత్యంత విధేయతను ప్రకటించినందునే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. 
 
మదన్‌లాల్‌ తానూ హాస్టల్‌లో కలిసి చదువుకున్నామని, గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక రాములునాయక్‌ను బీఆర్‌ఎ్‌సలోకి తీసుకొని మదన్‌లాల్‌ ప్రగతిభవన్‌గేట్‌ వద్ద పడిగాపులు కాసినా కేసీఆర్‌ ఆయనకు అపాయిట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించారని చెప్పారు. ఆ విషయాన్ని మదన్‌లాల్‌ తనకు అనేకసార్లు చెప్పుకొని బాధపడేవాడని ఈటల వివరించారు.