జీ 20 అతిధులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు

జీ 20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేసింది. వాయుసేన వీటిలో భాగస్వామి అయింది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు, బ్రిటన్, కెనడా ప్రధానులు సహా మొత్తం 70 మంది వీవీఐపీ విమానాలు ఫాలం టెక్నికల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ సహా కొన్నివిమానాలను ఫాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో పార్క్ చేయనున్నారు.
దీంతోపాటు అత్యవసర పరిస్థితుల కోసం లఖ్‌నవూ, జైపూర్, ఇండోర్, అమృత్‌సర్ లలోని నాలుగు రిజర్వు ఎయిర్‌పోర్టులను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 220 పార్కింగ్ స్టాండ్‌లు ఉన్నాయి. కానీ విమానాల రద్దీ పెరగడంతో ఇవి చాలని పరిస్థితి. దీనికి తోడు గోఫస్ట్ దివాలాతో ఆ సంస్థకు చెందిన 50 విమానాలు ఇప్పటికే పార్కింగ్‌లో ఉండిపోయాయి. 

దీంతో నిర్ణీత తేదీల్లో ఈ విమానాశ్రయంలో ఛార్టర్, బిజినెస్ జెట్‌ల ల్యాండింగ్ , టేకాఫ్‌లను అనుమతించకూడదని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఆర్మ్ ట్రాఫిక్ కంట్రోల్ మార్గదర్శకాలు జారీ చేశాయి. జీ20 సదస్సు నిర్వహించే తేదీల్లో సఫ్దర్‌గంజ్ ఎయిర్‌పోర్టును మూసివేయనున్నారు.  ఇక్కడి నుంచి అత్యవసర బ్యాకప్ సపోర్ట్ , విధుల కోసం ఎయిర్ ఫోర్స్, ఎన్‌ఎస్‌జీ హెలికాప్టర్లను మాత్రమే టేకాఫ్, ల్యాండింగ్‌కు అనుమతిస్తారు.

దేశాధి నేతలకు ఆహ్వానం పలికేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మూడు సెర్మోనియల్ లాంజ్‌లను సిద్ధం చేశారు. వీటిలో వారు తమ నిబంధనలు పూర్తి చేసుకొని వేగంగా వెళ్లిపోవచ్చు. సాధారణ ప్రయాణికులకు ఇబ్బది రాకుండా ఈ ఏర్పాట్లు చేశారు.

కాగా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాన సర్వీస్‌లు రద్దు కానున్నాయని ఢిల్లీ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ ప్రతినిధి వెల్లడించారు. ఢిల్లీ నుంచి బయల్దేరే 80 విమానాలు, వచ్చే మరో 80 విమానాలు రానున్న మూడు రోజుల్లో రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు. జీ20 సదస్సు కారణంగా రానున్న మూడు రోజుల్లో విధించిన ట్రాఫిక్ నిబంధనలతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈ సదస్సు కోసం ఎయిర్‌పోర్టులో అన్ని రకాల పరికరాలు, పార్కింగ్ సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని వివరించారు.

“ ఇప్పటివరకు మా అంచనాల మేరకు మూడు రోజుల్లో రాకపోకలు సాగించే 160 దేశీయ విమానాలు రద్దవుతాయని భావిస్తున్నాం. సాధారణంగా ఎయిర్ పోర్టు నిర్వహించే దేశీయ సర్వీస్‌ల ఆపరేషన్లలో ఇవి 6 శాతానికి సమానం. ఆంక్షల కారణంగా అంతర్జాతీయ సర్వీసుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము ప్రయాణికుల అసౌకర్యాన్ని వీలైనంత తగ్గించేందుకు విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం ” అని ఢిల్లీ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ ప్రతినిధి పేర్కొన్నారు.

మరోవైపు విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాయి. విస్తారా, ఎయిర్ ఇండియా, సంస్థలు తాము ఎంపిక చేసిన రీషెడ్యూల్ అయిన విమాన సర్వీసుల బుకింగ్స్‌ను వినియోగదారులు ఒకసారి మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. ఈ విషయాన్ని ఎక్స్(ట్విటర్ ) వేదికగా ప్రకటించాయి.