కోడి కత్తిని సమకూర్చింది బొత్స మేనల్లుడే

2019 ఎన్నికల ముందు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విశాఖపట్నం విమానాశ్రయంలో  నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడికి కోటికత్తిని సమకూర్చింది నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడి అని నిందితుడు శ్రీనివాసరావు తరపున న్యాయవాది ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఎ కోర్టుకు తెలిపారు.
 
ఈ కేసులో సాక్షిగా ఉన్న ఎయిర్‌పోర్ట్ భద్రతా అధికారి దినేష్‌కుమార్‌కు బొత్స మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కత్తిని అందించారని లాయర్‌ సలీం కత్తిని అందించారని చెప్పారు. ఈకేసులో విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే భయంతోనే సిఎం జగన్‌ ఎన్‌ఐఏ కోర్టుకు రావడం లేదని ఆరోపించారు.

జగన్‌పై దాడి కేసులో కుట్ర, రాజకీయ కోణమే ఉందని న్యాయవాది సలీం ఆరోపించారు. విజయవాడ నుంచి బదిలీ అయిన తర్వాత తొలిసారి కోడికత్తి కేసుపై విశాఖ ఎన్‌ఐఏ న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరిగింది. రాజకీయాల కోసమే కేసును వాయిదాలు వేస్తూ సాగదీస్తున్నారని విమర్శించారు. 

కేసు విచారణ వేగంగా జరగడానికి ‘రావాలి జగన్‌.. చెప్పాలి వాదన.. ఇవ్వాలి ఎన్‌వోసీ’ అని స్పష్టం చేశారు. దాడి కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్‌ఐఏ తేల్చిందని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై కేసు విచారణ ఇన్నాళ్లు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో సాగింది. 

కొత్త కోర్టు ఏర్పాటైన నేపథ్యంలో విచారణను విశాఖకు బదిలీ చేయడంతో తొలిసారి విచారణ జరిగింది. వాదనల అనంతరం విచారణ సెప్టెంబరు 6కు వాయిదా పడింది. ఇప్పటివరకు విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులను పరిశీలించి విచారణ ముందుకు తీసుకెళ్లడానికి సెప్టెంబరు 18 వరకు గడువునివ్వాలని ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిద్ధిరాములు న్యాయస్థానాన్ని కోరారు.