ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల తొలగింపుపై చెలరేగిన రాజకీయ వివాదం ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్ళింది. ఒకే రోజు వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఫిర్యాదులు చేయడంతో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఢిల్లీ పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమిషన్ ఉన్నతాధికారులతో సోమవారం గంటపాటు భేటీ అయ్యారు. ఏపీలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో వైసీపీ నేతలు చెప్పినట్లు ఓట్లు తొలగించారని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా చోట్లా జరిగాయని చంద్రబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఒక పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించాలనే దుర్మార్గపు అలోచన ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి రాలేదని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపులో వైసీపీ చేసిన దారుణాలను సాక్ష్యాధారాలతో ఈసీకి సమర్పించామని చంద్రబాబు చెప్పారు. తనపై దాడిచేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని ఆరోపించారు.
చంద్రబాబు ఫిర్యాదుకు పోటీగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సీఈసీని ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో భారీగా నకిలీ ఓటర్లను చేర్చారని, వాటిని ఇప్పుడు తొలగించామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న విజయసాయిరెడ్డి అవి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అక్రమంగా చేర్చారని ఆరోపించారు.
2019లో ఎన్నికలకు ముందు ఏపీలో 3.97 కోట్ల ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం ఓ లక్ష ఎక్కువే ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓట్లను ఎలా మార్చారో పూర్తి వివరాలను ఈసీకి అందించామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు బాధంతా ఆధార్ కార్డుకు ఓటర్ కార్డును లింక్ చేశారనే అని ఆయన విమర్శించారు.
వ్యక్తి చనిపోయిన వెంటనే ఆధార్ కార్డు పనిచేయదని, దానితో ఓటర్ కార్డు కూడా పనిచేయదని ఆయన చెప్పారు. ఒలింపిక్స్లో దొంగ ఓట్ల పోటీలు పెడితే చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. 2015 నుంచి ఉన్న దొంగ ఓట్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందించామని తెలిపారు.
More Stories
ఎన్డీఏది అభివృద్ధి మంత్రం – వైసీపీది అవినీతి తంత్రం
ఏపీ ప్రభుత్వ నిధులు విడుదల ఎత్తుగడకు ఈసీ అడ్డు
జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్