రాష్ట్రపతి భవన్‌ కార్యక్రమంపై రాజకీయం తగదు

భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్ ను రాజకీయాల్లోకి లాగడం సరికాదని అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై పురందేశ్వరి నేరుగా స్పందిస్తూ రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో కుటుంబమంతా హాజరయ్యాం అని, కుటుంబ సభ్యుల హాజరుపై రాజకీయ రంగు పులమండం శోచనీయం అని విచారం వ్యక్తం చేశారు. 
 
తమ తరువాత వారసులు కూడా తాతపై ప్రేమతో పాల్గొన్నారని ఆమె గుర్తు చేశారు. దానికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని గట్టిగా చెప్పారు. పురంధేశ్వరి టీడీపీ ప్రతినిధిగా మారారని ఆరోపించడమే కాకుండా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాసాన్ని ఇప్పుడు రాజకీయ ఎజెండాలకు వేదికగా వాడుకుంటున్నారని సజ్జల పేర్కొనడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ బీజేపీ సోషల్ మీడియా, ఐటి ప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పేదల కోసం గ్యాస్‌పై రూ. 2 వందలు తగ్గిస్తే దాన్ని రాజకీయం చేయడం తగదని హితవు చెప్పారు. టీటీడీ వంటి హిందూ బోర్డులో అన్యమతస్తులను నియమించారని పేర్కొంటూ, మనోభావాలు దెబ్బ తినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని పైన పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు.

కేంద్రం ఏపీకి చేసిన సాయం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను తమ ప్రతినిధులు ప్రజలకు వివరిస్తారని పురంధేశ్వరి తెలిపారు. ఎన్నికల సమయానికి అందరూ సన్నధ్దం కావాలని ఆమె పిలుపిచ్చారు. సోషల్ మీడియా ఎంతో కీలకంగా పనిచేస్తోందని చెబుతూ సమాజంలో సోషల్ మీడియా అంశాలపైనే చర్చ సాగుతోందని ఆమె పేర్కొన్నారు. 

సోషల్ మీడియాలో ఎలా పని‌చేయాలో శిక్షణ ఇస్తామని పేర్కొంటూ ఎన్నికల సమర శంఖం పూరించేలా శంఖానాదం అని పేరు పెట్టామని చెప్పారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని, రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణుల కోసం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారని మాజీ కేంద్ర మంత్రి వివరించారు.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపుపై తాము పోరాటం చేశామని, బీజేపీ మిత్ర పక్షమైన జనసేనతో కలిసి ఆందోళనలు నిర్వహించామని పురంధేశ్వరి తెలిపారు. అన్ని అంశాలను గవర్నర్‌కు, కేంద్రంలో పెద్దలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘నా భూమి, నాదేశం‌’ కార్యక్రమం బీజేపీ చేపట్టిందని, సెప్టెంబరు ఒకటి నుంచి 15 వరకు అన్ని గ్రామాల్లో మట్టిని సేకరిస్తామని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో బియ్యం సేకరిస్తామని, ఆ మట్టిని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృత వనం ఏర్పాటు చేస్తామని పురంధేశ్వరి వివరించారు.