మరోసారి వివాదాస్పద మ్యాప్ తో రెచ్చగొడుతున్న చైనా

చైనా మరోసారి భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. చైనా ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్‌లో భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, వివాదాస్పద అక్సయ్ చిన్ ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా చైనా ఈ పటంలో చూపించింది.
42 మంది ఇతర దేశాధినేతలతో చైనా అధ్యక్షుడిని ఆహ్వానించిన  భారత్ న్యూఢిల్లీలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జి20 సమ్మిట్‌కు దాదాపు పది రోజుల ముందు చైనా ఇటువంటి వివాదాస్పద మ్యాప్ ను విడుదల చేయడం రెచ్చగొట్టేవిధంగానే ఉంది. దక్షిణ టిబెట్‌గా అరుణాచల్ ప్రదేశ్‌ను చూపించిన చైనా 1962 యుద్ధ కాలంలో ఆక్రమించిన అక్సయ్ చిన్ ప్రాంతాన్ని తన భూభాగంగా చూపించింది.
కొత్త పటంలో తైవాన్‌తోపాటు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని కూడా తన భూభాగంలో చైనా చేర్చుకుంది. దక్షిణ చైనా సముంద్రంలో అతిపెద్ద భాగంగా ఉన్న నైన్‌ డ్యాష్‌ లైన్‌ను కూడా తమ ప్రాంతంగా చూపించుకున్నది. అయితే దీనిపై వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనై దేశాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.

“చైనా ప్రామాణిక మ్యాప్ 2023 ఎడిషన్ సోమవారం అధికారికంగా విడుదల చేసాము. సహజ వనరుల మంత్రిత్వ శాఖ హోస్ట్ చేసిన ప్రామాణిక మ్యాప్ సర్వీస్ వెబ్‌సైట్‌లో ప్రారంభించాము” అని పోస్ట్  లో పేర్కొన్నారు. “ఈ మ్యాప్ చైనా, ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ సరిహద్దుల డ్రాయింగ్ పద్ధతి ఆధారంగా సంకలనం చేయబడింది” అని తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను “ప్రామాణిక” చేస్తామని చెప్పింది. ఆ సమయంలో, అది సిసిపి ప్రభుత్వం జాంగ్నాన్‌గా సూచించే దక్షిణ టిబెటన్ ప్రాంతంలోని అరుణాచల్ భాగాలను చూపించింది. అంతేకాకుండా, చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు దగ్గరగా ఉన్న పట్టణాన్ని చేర్చింది. అయితే, భారతదేశం, అనేక సందర్భాల్లో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం  “ఎల్లప్పుడూ” దేశంలో అంతర్భాగంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నది.

అంతర్యుద్ధం తర్వాత 1949లో తైవాన్ చైనాతో విడిపోయింది. అయితే,  అధికార కమ్యూనిస్ట్ పార్టీ అవసరమైతే బలవంతంగా ద్వీపం తిరిగి ప్రధాన భూభాగంలో చేరవలసి ఉంటుందని స్పష్టం చేసింది. తైవాన్ ప్రభుత్వం విదేశీ ప్రభుతాలతో సన్నిహితంగా ఉండటం పట్ల చైనా అసహనం వ్యక్తం చేస్తున్నది. ఆ విధంగా ఉండటంతో వారిలో స్వతంత్ర కాంక్షను రేకెక్తిస్తుమ్దని అంటూ ఇది యుద్ధానికి దారితీస్తుందని చైనా హెచ్చరిస్తున్నది. 

దక్షిణ చైనా సముద్రంలోని అత్యధిక భాగాన్ని తన సరిహద్దుల్లో చైనా కలిపేసుకుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలు తమవేనంటూ వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. జెజియాంగ్ ప్రావిన్సులోని డెకింగ్ కౌంటీలో సోమవారం సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ పబ్లిసిటీ డే, నేషనల్ మ్యాపింగ్ అవేర్‌నెట్ పబ్లిసిటీ వీక్ వేడుకల సందర్భంగా చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ తాజా దేశ పటాన్ని విడుదల చేసింది.

ఈ వివాదాస్పద పటాన్ని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెబ్ సిట్, సోషల్ మీడియా వేదికలపై ఉంచింది.  2020లో సరిహద్దుల్లో రెండు దేశాల సేనల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత రెండు దేశాధినేతలు ఇప్పటివరకు ముఖాముఖి సమావేశం కాలేదు. ద‌క్షిణాఫ్రికాలో బ్రిక్స్ స‌ద‌స్సు సంద‌ర్భంగామోదీ, జిన్‌పింగ్ ముచ్చటించుకున్నారని విదేశాంగ కార్యద‌ర్శి విన‌య్ మోహ‌న్ చెప్పారు.

భారత్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబ‌డి ప‌లు ప్రాంతాల్లో అప‌రిష్కృత అంశాల‌పై ఈ సంద‌ర్భంగా జిన్‌పింగ్‌తో ఆందోళ‌న వ్యక్తం చేశార‌ని పేర్కొన్నారు. కాగా, వారిద్దరిమధ్య చర్చలు జరిగి వారం కూడా గడవకవముందే అరుణాచల్‌, ఆక్సాయ్‌ చిన్‌ భూభాగాలు తమవేనంటూ చైనా మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం.