ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష నిలిపివేత

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఇస్లామాబాద్‌ హైకోర్టు నిలిపివేసింది.

ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఆమెర్ ఫరూఖ్, జస్టిస్ తారీఖ్ మహమూద్ జహంఈర్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. తోషాఖానా అవినీతి కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది తన వాదనలు ముగించడంతో తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఇమ్రాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.  కాగా, ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇమ్రాన్‌ను దేషిగా తేల్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఆగస్టు 5వ తేదీన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఇమ్రాన్‌ పంజాబ్ ప్రావిన్సులో ఉన్న అటాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. హైకోర్టు ప్రాంగణం వెలుపల, కోర్టు లోపల భారీ పోలీసు, పారా మిలిటరీ బలగాలు మోహరించాయి.