పాక్ లో భారత్ మిషన్ చీఫ్ గా మొదటి మహిళ

ఇస్లామాబాద్‌లోని హైకమిషన్‌ కార్యాలయంలో భారత చార్జ్‌ డి’అఫైర్స్‌గా (దౌత్య మిషన్‌ తాత్కాలిక చీఫ్‌)గా గీతికా శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా ఆమె నిలిచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.  డా.ఎం. సురేష్‌ కుమార్‌ న్యూఢిల్లీకి తిరిగి రావడంతో ఆమె ఈ పదవికి ఎన్నికయ్యారు.

2005 ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ బ్యాచ్‌కి చెందిన గీతికా శ్రీవాస్తవ ప్రస్తుతం ఇండో-ఫసిపిక్‌ డివిజన్‌లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ (ఎంఇఎ) శాఖ జాయింట్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.  ఆమె 2007 నుండి 2009 వరకు చైనాలోని భారత హైకమిషన్‌లో పనిచేశారు. ఇండియా, పాకిస్తాన్‌ మిషన్స్‌ న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని ఇండియా, పాకిస్తాన్‌ మిషన్‌లు 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి  నుండి హై కమిషనర్లు లేకుండా చార్జ్‌ డి అఫైర్స్‌ నేతృత్వంలో నడస్తున్నాయి. 

 హై క మిషన్‌ హోదాను తగ్గించడానికి ముందు ఇస్లామాబాద్‌లోని చివరి భారతీయ హైకమిషనర్‌గా అజరు బిసారి వ్యవహరించారు. గతంలో భారత్ ఇస్లామాబాద్ లో మహిళా అధికారులను నియమించిన్నప్పటికీ అత్యున్నత అధికారి హోదాలో నియమించడం ఇదే మొదటిసారి. పైగా, అక్కడ కొద్ది సంవత్సరాలుగా `కుటుంభం సభ్యులు’ లేకుండా అధికారులు పనిచేయాల్సి వస్తుంది. 

ప్రస్తుతం ఇస్లామాబాద్ లో మొదటి కార్యదర్శిగా మరో మహిళా దౌత్యవేత్త పనిచేస్తున్నారు. గీతికా శ్రీవత్సవ త్వరలో ఇస్లామాబాద్ లో బాధ్యతలు చేపట్టనున్నారు. పాకిస్తాన్ సహితం ఢిల్లీలో తాజాగా కొత్త చార్జ్‌ డి’అఫైర్స్‌గా సాద్ అహ్మద్ వరిరైచ్ ను నియమించింది. ఆయన ఇదివరకు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. ఇక్కడ పనిచేస్తున్న సల్మాన్ షరీఫ్ గత నెలలో పాకిస్తాన్ కు తిరిగి వెళ్లడంతో కొత్త దౌత్యవేత్తను నియమించాల్సి వచ్చింది.